
హైదరాబాద్: 2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు ముఖాముఖి పోరులో తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్లోనే కాదు.. వన్డే ప్రపంచకప్లోనూ ఇప్పటి వరకూ భారత్ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్థాన్ ఓడించలేకపోయింది. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో మాత్రమే పాక్ గెలిచింది. దాంతో టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో కూడా కోహ్లీసేననే కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పాక్ చరిత్రను తిరగరాసింది.
ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్లో గెలవని ఇండియాపై పాకిస్తాన్ తొలి విజయాన్ని అందుకుని రికార్డు నెలకొల్పింది. టీమిండియాను ఓడించడం హేమాహేమీల వల్ల కానిది బాబర్ ఆజామ్ చేసి చూపించాడు. ప్రపంచాన్ని జయించిన ఇమ్రాన్ ఖాన్ వల్ల కాలేదు.. స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్కు వశపడలేదు.. గండర గండడు షాహీద్ అఫ్రిదికి సాధ్య పడలేదు కానీ బాబర్ సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో టీమిండియాపై పాకిస్థాన్ తొలి విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాక్ గెలవగానే దుబాయ్ స్టేడియం మొత్తం ఆ దేశ అభిమానుల సందడితో హోరెత్తింది.
దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తండ్రి అజామ్ సిద్దిఖి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుమారుడి చిరస్మరణీయ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాపై గెలవటం పాకిస్తాన్ జట్టు మరియు ఆ దేశ ప్రజల కల. ఆ కల తన కొడుకు సారథ్యంలో తీరటంతో బాబర్ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. పక్కన ఉన్న వారందరూ అతడిని హగ్ చేసుకున్నారు. ఎంతైనా ఒక కుమారుడు గొప్ప పని చేస్తే ఏ తండ్రి అయినా ఇలాగే గర్వపడతారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) పాక్ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో భారత (12-1) ఆధిపత్యానికి తెరదించారు.