IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 23) నాడు దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల మధ్య మ్యాచ్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు జీవన్మరణ సమరం లాంటిదనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్థాన్ సెమీస్ అవకాశాన్ని కోల్పోయినట్టే. మరో వైపు బంగ్లాదేశ్ ను ఓడించిన తర్వాత భారత జట్టు మంచి ఫామ్ లో ఉంది. ఈ పరిస్థితిలో రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో భారత్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు.
వైట్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే భారత్ అత్యంత శక్తివంతమైన జట్టు అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో ఐసీసీ సిరీస్ లలో భారత్ ఒక్కసారి మాత్రమే పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే జట్టుగా భారత్ పరిగణించబడుతుందని చెప్పాడు. పాకిస్థాన్ జట్టు భారత్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదన్నారు. పాకిస్థాన్ జట్టుకు స్పిన్ బౌలింగ్ ను ఎలా ఆడాలో తెలియదన్నారు. భారత జట్టులో అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్ అనే ముగ్గురు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారని.. దుబాయ్ పిచ్ కూడా స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఇది పాకిస్థాన్ ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని చెప్పాడు. స్పిన్ బౌలింగ్ కు వ్యతిరేకంగా విరాట్ కోహ్లీ సమస్యను పరిష్కరిస్తాడని తాను నమ్ముతున్నానని చెప్పాడు. విరాట్ కోహ్లీ 81 అంతర్జాతీయ సెంచరీలు చేశాడని.. కాబట్టి లెగ్ స్పిన్ లో పరుగులు ఎలా చేయాలో అతనికి తెలుసన్నారు. వైట్ బాల్ క్రికెట్ కు సంబంధించినంతవరకు భారత్ లో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని గంగూలీ చెప్పాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 క్రికెట్ లో అభిషేక్ శర్మ ఆడుతున్నాడనేది నమ్మశక్యం కాదన్నారు. దీని అర్థం అతను వన్డే క్రికెట్ లో కూడా ఆడగలడన్నారు. సెలెక్టర్లు, కోచ్ ఇప్పుడు తమకు కావలసిన ఆటగాళ్లను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారన్నారు. ఎందుకంటే అందరు ఆటగాళ్లు ప్రతిభావంతులేనని చెప్పాడు. భారత్ జట్టులో ఐదుగురు శుభ్ మన్ గిల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు. వారు ఏ మ్యాచ్ లోనైనా సెంచరీ చేసి మ్యాచ్ ను గెలిపించగలరని గంగూలీ స్పష్టం చేశాడు.