
తప్పుకొన్న అఫ్రిది..
పాకిస్తాన్ బౌలింగ్ వెన్నెముక, ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది గాయపడ్డాడు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఈ టోర్నమెంట్ ఒక్కటే కాదు. దీని తరువాత ఇంగ్లాండ్లో పర్యటించాల్సి ఉన్న పాకిస్తాన్ జట్టులోనూ అతనికి చోటు లభించకపోవచ్చు. గాయం వల్ల కనీసం ఆరు వారాల పాటు షహీన్ షా అఫ్రిది విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మళ్లీ అతను అక్టోబర్లో జట్టులోకి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ఫీల్డింగ్ చేస్తూ..
ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్ట్ ఆడుతున్న సమయంలో షహీన్ షా అఫ్రిది గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. ఆ తరువాత అతనికి స్కానింగ్ నిర్వహించగా.. కుడి మోకాలి ఎముక చిట్లినట్లు తేలింది. నెదర్లాండ్స్లోని రొట్టెన్డామ్లో గల రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.

నెదర్లాండ్స్లో..
రొట్టెన్డామ్లో రిహాబిలిటేషన్ నుంచి రిపోర్ట్స్ అందిన తరువాత షహీన్ షా అఫ్రిది మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడతాడనేది చెప్పగలమని పీసీబీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరుల్లా సూమ్రో తెలిపారు. గాయం వల్ల ఆసియా కప్ నుంచి వైదొలగాల్సి వచ్చినట్లు అతనికి తెలియజేశామని చెప్పారు. తీవ్ర నిరాశకు గురయ్యాడని, అతని ఆవేదనను అర్థం చేసుకోగలమని నజీరుల్లా వ్యాఖ్యానించారు. అఫ్రిది తమకు ఎంతో విలువైన ఆటగాడని, అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

ఎల్లుండి దుబాయ్కు..
రొట్టెన్డామ్ రిహాబిలిటేషన్ సెంటర్తో పాకిస్తాన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సోమవారం దుబాయ్కు బయలుదేరనుంది. నెదర్లాండ్స్ నుంచి నేరుగా దుబాయ్కు చేరుకుంటుంది. షహీన్ షా అఫ్రిది మాత్రం అక్కడే ఉంటాడు. రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకుంటాడు. ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 28వ తేదీన భారత్ను ఢీ కొట్టనుంది పాకిస్తాన్.


Click it and Unblock the Notifications
