మూడు వికెట్ల నష్టానికి
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా- ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయి 146 పరుగులు చేసింది. వెలుతురు లేమి వల్ల షెడ్యూల్ కంటే ముందే మ్యాచ్ను ముగించాల్సి వచ్చింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కేప్టెన్ విరాట్ కోహ్లీ 44, అజింక్య రహానె 29 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వన్డౌన్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా అవుట్ అయ్యారు. వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉన్నందున.. స్కోర్ బోర్డుపై భారీ స్కోరు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్నీ కుదిరినా..
అన్నీ బాగానే ఉన్నప్పటికీ.. వర్షం పడొచ్చనే బెంగ ఫ్యాన్స్ను పట్టి పీడిస్తోంది. గ్రౌండ్లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వని పరిస్థితుల మధ్య తొలి రోజు మ్యాచ్ రద్దు కావడం, రెండో రోజు దట్టమైన మేఘాలు కమ్ముకోవడం, ఫలితంగా వెలుతురు లేమితో మ్యాచ్ను అర్ధాంతరంగా ముగించేయడం వంటి పరిణామాలు అభిమానుల ఆందోళనకు కారణమౌతోన్నాయి. గాడిలో పడినట్టే కనిపించిన మ్యాచ్ను మళ్లీ వరుణుడు అడ్డుకుంటాడేమోననే టెన్షన్ ఫ్యాన్స్లో ఉంది.
బ్రిటన్ వాతావరణ శాఖ ఏం చెబుతోంది..
ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం..ఆదివారం సౌథాంప్టన్లో వర్షం పడే అవకాశం లేదని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మబ్బులు కూడా తొలగిపోతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం తరువాత ఎండ కాస్తుందనీ స్పష్టం చేశారు. వర్షం పడటానికి 40 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీని ప్రకారం చూసుకుంటే- మూడో రోజు ఆట దాదాపు పూర్తిస్థాయిలో సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇక ఉరుములు, మెరుపులు ఆకాశంలో కాదు.. గ్రౌండ్లో కనిపిస్తాయి. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె క్రీజ్లో పాతుకుపోవటం వల్ల భారీ స్కోరు ఖాయమైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ..
చారిత్రాత్మకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం అతని వ్యక్తిగత స్కోరు 44. 124 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ స్కోర్ కార్డ్లో నమోదైంది ఒకే ఒక్క బౌండరీ మాత్రమే. దీన్ని బట్టి చూస్తే అతను ఎంత కంట్రోల్డ్గా ఆడుతున్నాడనేది స్పష్టమౌతోంది. ఒక్కసారి కుదురుకుంటే భారీ స్కోరును అవలీలగా ఊది అవతల పడేయగలడు కోహ్లీ.
టెస్టుల్లో అర్ధసెంచరీల కంటే సెంచరీలే ఎక్కువ బాదడాన్ని దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. 154వ టెస్ట్ను ఆడుతోన్న కోహ్లీ ఇప్పటిదాకా 25 అర్ధసెంచరీలు, 27 సెంచరీలు కొట్టాడు. మరో ఎండ్లో రహానె క్రీజ్లో ఉన్నాడు. రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్న అతను 29 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు.