
లండన్: చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ తొలిరోజును తుడిచి పెట్టేసిన వరుణ దేవుడు.. కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. రెండో రోజు ఆటకు అవకాశం ఇచ్చాడు. మార్నింగ్ సెషన్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సౌథాంప్టన్లో వర్షం కురుస్తోన్నప్పటికీ- ఉదయం పూట కొన్ని గంటలపాటు తెరపినిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రకారం చేసుకుంటే కనీసం రెండు సెషన్ మ్యాచ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే- భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడటానికి ఛాన్స్ ఉంది. బ్రిటన్ కాలమానం ప్రకారం.. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వర్షం పడే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాక్షికంగా ఎండ పడుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం తరువాత మళ్లీ సాయంత్రం వరకూ వర్షం పడుతుందని, రాత్రికి కాస్త విరామం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనితో తొలి రెండు సెషన్ల మ్యాచ్ను ఆడటానికి భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధపడతాయి.
వర్షం ఆగిన వెంటనే గ్రౌండ్ను ఎండబెట్టే పనులను చేపడతామని సౌథాంప్టన్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. దీనికి అవసరమైన పరికరాలు, యంత్రాలతో గ్రౌండ్ స్టాఫ్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. వాతావరణం ఏ మాత్రం అనుకూలించినా.. ఇవ్వాళ మ్యాచ్ ఆరంభమౌతుంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 10:30 గంటలకు టాస్ వేస్తారు. నిర్దేశిత సమయానికి అరగంట ఆలస్యంగా టాస్ పడుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు మ్యాచ్ కొనసాగుతుంది.
ఈ గ్యాప్లో కనీసం 80 నుంచి 85 ఓవర్లు పడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ తరువాత 2:30 నుంచి 4 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉంది. ఆ తరువాత కూడా తేలికపాటి జల్లులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి ఎండ కాస్తుందని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట, 2 గంటలకు 16 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదవుతుంది. 3 గంటలకు మళ్లీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత మరింత దిగజారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.