బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ. మూడో రోజు ఆటకు రిషభ్ పంత్ పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా పంత్ శుక్రవారం ఆటకు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో సబ్స్టిట్యూట్గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు కొనసాగిస్తాడని పేర్కొంది.
రెండో రోజు ఆటలో రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి గాయమైంది. ఆఫ్ స్టంప్ మీదుగా జడేజా వేసిన బంతి డెవాన్ కాన్వేకు మిస్సై.. పంత్ కుడి మోకాలికి బలంగా తాకింది. ప్యాడ్స్ కవర్ కాకపోవడంతో నేరుగా మోకాలికి బంతి తగిలింది. సర్జరీ అయిన చోటే తగలడంతో పంత్ నొప్పితో విలవిలలాడాడు.

ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా లాభం లేకపోయింది. దాంతో వారి భుజాలపై చేతులు వేసి అతి కష్టంగా పంత్ మైదానం వీడాడు. గురువారం ఆట ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ గాయం గురించి వివరణ ఇచ్చాడు. రిషభ్ పంత్ మోకాలు వాచిందని, ఇప్పటికే అక్కడ సర్జరీ జరగడంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని రోహిత్ చెప్పాడు.
మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షణ చేస్తుందని, అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోమని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లోనే అతను మళ్లీ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నామని తెలిపాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత్ కంటే 194 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పంత్ రెండో ఇన్నింగ్స్కు బ్యాటింగ్ రాకపోతే టీమిండియా మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.