మాంచెస్టర్: తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు భారత్కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 239 పరుగులు చేసింది కివీస్. రెండో రోజు మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. 48వ ఓవర్ చివరి బంతికి రాస్ టేలర్ రనౌట్ అయ్యాడు. బుమ్రా బంతిని డీప్ స్క్వేర్లెగ్ వైపు ఆడాడు రాస్ టేలర్. ఒక రన్ పూర్తి చేశాడు. ఇంకో రన్ కోసం ప్రయత్నించాడు. ఇంకో ఎండ్లో ఉన్న టామ్ లాథమ్ పిలుపు అందుకున్న టేలర్.. రెండో రన్ కోసం పరుగెత్తాడు. ఆ లోపే డీప్ స్క్వేర్లెగ్లో ఫీల్డింగ్లో ఉన్న రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. వికెట్ కీపర్ వైపు బంతిని త్రో చేశాడు. నేరుగా వికెట్లను తాకిందా బంతి. అంతే. ఇంకో ఛాన్సే లేకుండా, రాస్ టేలర్ పెవిలియన్ దారి పట్టాడు.
49వ ఓవర్ తొలి బంతికి న్యూజిలాండ్ మరో వికెట్ను కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని భారీ షాట్ ఆడాడు టామ్ లాథమ్. ఇక్కడ కూడా రవీంద్ర జడేజా తన ప్రతిభను ప్రదర్శించాడు. స్టాండ్స్ వైపునకు దూసుకెళ్తున్న ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు. దీనితో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది కివీస్. అదే ఓవర్ చివరి బంతికి మ్యాట్ హెన్రీ కూడా వికెట్ సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ చివరి బంతిని లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు హెన్రీ. అది కాస్తా నేరుగా వెళ్లి కేప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో వాలింది. దీనితో మూడు వికెట్లను కోల్పోయింది.
కాగా చివరి 23 బంతుల్లో 28 పరుగులను సాధించగలిగారు బ్లాక్ క్యాప్స్. అసంపూర్తిగా ముగిసిన 47వ ఓవర్లో ఎనిమిది పరుగులను రాబట్టుకున్నారు. 48వ ఓవర్లో ఎనిమిది పరుగులు చేశారు. చివరి రెండు ఓవర్లలో ఏడు పరుగులు చొప్పున సాధించారు. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. మొత్తం 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులను చేసింది. టీమిండియా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.