దాదాపు 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాష్టింగ్టన్ సుందర్ బంతితో విజృంభించాడు. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగి న్యూజిలాండ్ను కుప్పకూల్చాడు. ఏడు వికెట్ల (7/59)తో సత్తాచాటి.. 197/3తో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ను 259 పరుగులకు ఆలౌట్ చేశాడు. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో చివరి ఏడు వికెట్లను సుందరే పడగొట్టడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ మిగిలిన మూడు వికెట్లు తీశాడు.
పునరాగమనంలో సంచలన ప్రదర్శనతో వాషింగ్టన్ సుందర్ సత్తాచాటాడు. అయితే ఈ ప్రయాణంలో సుందర్ శ్రమించిన తీరును, అతని సంకల్పాన్ని సుందర్ సోదరి శైలజ 'మైఖేల్'తో వివరించారు. గాయాలపాలైనా సుందర్ జట్టుకు 100 శాతం తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని తెలిపారు. రవిచంద్రన్ అశ్విన్తో తన సోదరుడిని పోల్చవద్దని, అది సుందర్కు ఒత్తిడిలోకి నెడుతుందని శైలజ పేర్కొన్నారు.

''గతంలో క్రికెట్లో ఫిట్నెస్ అంత పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడూ ఓటమి అంగీకరించడు. గాయపడినా 100 శాతం ప్రయత్నిస్తాడు. అతన్ని చిన్నతనం నుంచి చూస్తున్నా, ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటాడు. కఠోర శ్రమ, సాధనే అతను విజయవంతమవ్వడానికి కారణం''
''గతంలో సుందర్ సెంచరీని మిస్ చేసినప్పుడు, స్టూడెంట్ ఓ మార్క్ మిస్ చేస్తే అడిగినట్లుగా మా తండ్రి సరదాగా ప్రశ్నించారు. అయితే ఒకే ఇన్నింగ్స్లో సుందర్ ఏడు వికెట్ల ప్రదర్శన చూసి ఇప్పుడు మా కుటుంబం ఎంతో సంతోషిస్తోంది. టెస్టు క్రికెట్ స్వచ్ఛమైన ఫార్మాట్. ఆటగాడి నైపుణ్యాలు, ప్రదర్శనను పరీక్షిస్తుంటుంది. సుందర్ ప్రదర్శన మాకు గర్వకారణం''
''అయితే రవిచంద్రన్ అశ్విన్తో సుందర్ను పోల్చడం సరికాదు. ఎన్నో ఘనతలు సాధించిన లెజెండ్ అశ్విన్. సుందర్ ఎదుగుతున్న ఆటగాడు. ఇద్దరిది భిన్నమైన శైలి. అశ్విన్ అందుకున్న ఘనతలు సాధించాలంటే దేవుని ఆశీస్సులు కావాలి. అశ్విన్తో పోలుస్తూ సుందర్ను ఒత్తిడిలోకి నెట్టవద్దు. అశ్విన్ స్థానంలో బాధ్యతలు అందుకోవడం అతిపెద్ద భాధ్యత. అలాంటి అంచనాలతో సుందర్పై భారం వేయరని ఆశిస్తున్నా'' అని సుందర్ సోదరి శైలజ పేర్కొన్నారు.