వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి సెషన్లో ఆధిపత్యం చెలాయించాలని ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. కివీస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ భారత్ మూడు వికెట్లు సాధించి తొలి సెషన్లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ను ఆకాశ్ దీప్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తన తొలి రెండో ఓవర్లో డెవాన్ కాన్వే (4; 11 బంతుల్లో) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కివీస్ రివ్యూకి వెళ్లిన లాభం లేకపోయింది.
అయితే ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి న్యూజిలాండ్ ప్రయత్నించింది. విల్ యంగ్తో కలిసి కెప్టెన్ టామ్ లాథమ్ (28; 44 బంతుల్లో) నిలకడగా ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వాషింగ్టన్ సుందర్ బంతి అందుకోవడంతో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. కుదురుకున్న టామ్ లాథమ్ను సుందర్ చక్కని బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ వేసిన బంతి లాథమ్ డిఫెన్స్ను ఛేదించుకుంటూ ఆఫ్ స్టంప్ను తాకింది.

కాసేపటికి రచిన్ రవీంద్ర (5; 12 బంతుల్లో) మరో అద్భుతమైన బంతితో సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సిరీస్లో రచిన్ను ఔట్ చేయడం సుందర్కు మూడోసారి. సుందర్ వేసిన 28 బంతులు ఎదుర్కొన్న రచిన్ 12 పరుగులు చేసి మూడు సార్లు ఔటయ్యాడు. రచిన్ మూడు సార్లు బౌల్డవ్వడం విశేషం. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రచిన్ రవీంద్ర తర్వాత మ్యాచ్ల్లో తడబడటానికి కారణం సుందర్ స్టన్నింగ్స్ బౌలింగే. మొదటి టెస్టులో సుందర్ ఆడని విషయం తెలిసిందే.
కాగా, లంచ్ విరామానికి న్యూజిలాండ్ ప్రస్తుతం 27 ఓవర్లకు 92/3 స్కోరు చేసింది. క్రీజులో విల్ యంగ్ (38 నాటౌట్; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), డారిల్ మిచెల్ (11 నాటౌట్; 21 బంతుల్లో) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో సుందర్ రెండు, ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ తీశారు.