వాంఖడే వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో మొదటి రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ ప్రస్తుతం 27 ఓవర్లకు 92/3 స్కోరు చేసింది. క్రీజులో విల్ యంగ్ (38 నాటౌట్; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), డారిల్ మిచెల్ (11 నాటౌట్; 21 బంతుల్లో) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో సుందర్ రెండు, ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ను ఆకాశ్ దీప్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తన తొలి రెండో ఓవర్లో డెవాన్ కాన్వే (4; 11 బంతుల్లో) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కివీస్ రివ్యూకి వెళ్లిన లాభం లేకపోయింది. అయితే విల్ యంగ్తో కలిసి కెప్టెన్ టామ్ లాథమ్ (28; 44 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వాషింగ్టన్ సుందర్ బంతి అందుకోవడంతో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.

కుదురుకున్న టామ్ లాథమ్ను సుందర్ చక్కని బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ వేసిన బంతి లాథమ్ డిఫెన్స్ను ఛేదించుకుంటూ ఆఫ్ స్టంప్ను తాకింది. కాసేపటికి రచిన్ రవీంద్ర (5; 12 బంతుల్లో) మరో అద్భుతమైన బంతితో సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సిరీస్లో రచిన్ను ఔట్ చేయడం సుందర్కు మూడోసారి. సుందర్ వేసిన 28 బంతులు ఎదుర్కొన్న రచిన్ 12 పరుగులు చేసి మూడు సార్లు ఔటయ్యాడు. రచిన్ మూడు సార్లు బౌల్డవ్వడం విశేషం.
అయితే ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనత సాధించాడు. ఓ టెస్టు సిరీస్లో ఓ బ్యాటర్ను మూడు సార్లు ఔట్ చేసిన అరుదైన జాబితాలో సుందర్ చోటు సంపాదించాడు. 2007 తర్వాత ఈ ఘతన సాధించిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. గత రెండు దశాబ్దాల్లో ఈ ఘనతను కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. 2019 యాషెస్ సిరీస్లో జోస్ బట్లర్ను ప్యాట్ కమిన్స్ మూడు సార్లు ఔట్ చేశాడు. అంతకుముందు 2007లో పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్లో కమ్రాన్ అక్మల్ను అనిల్ కుంబ్లే మూడు సార్లు బోల్తా కొట్టించాడు.