బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌథి అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆరో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సౌథి అధిగమించాడు. 35 ఏళ్ల టిమ్ సౌథి వాస్తవానికి కుడిచేతివాటం స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్.
అయినప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తూ అరుదైన ఘనతలు సాధిస్తున్నాడు. 103 టెస్టుల్లో సౌథి 92 సిక్సర్లు సాధించాడు. ఏడో స్థానంలో ఉన్న సెహ్వాగ్ 104 టెస్టుల్లో 92 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (131 సిక్సర్లు), బ్రెండన్ మెక్కలమ్ (107), ఆడమ్ గిల్క్రిస్ట్ (100), క్రిస్ గేల్ (98), జాక్వెస్ కలిస్ (97) టిమ్ సౌథి ముందు ఉన్నారు.

కాగా, భారత్తో జరుగుతున్న మ్యాచ్లో టిమ్ సౌథి 57 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. రచిన్ రవీంద్ర (106 నాటౌట్; 134 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లకు 352 పరుగులు చేసింది. భారత్ కంటే 306 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్, అశ్విన్, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్గా ఇది మూడో అత్యల్ప స్కోరు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్క్ (4/22) ధాటికి రిషభ్ పంత్ (20), యశస్వీ జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.