సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాభవం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. అయితే షెడ్యూల్లో భాగంగా న్యూజిలాండ్తో ఆఖరి టెస్టు అనంతరం ఆస్ట్రేలియాలో అయిదు టెస్టుల కఠినమైన సిరీస్ను టీమిండియా ఎదుర్కోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ను రద్దు చేసినట్లు సమాచారం. వాంఖడే వేదికగా జరిగే న్యూజిలాండ్తో మూడో టెస్టుకు మాత్రమేనా, లేదా పూర్తిగా రద్దు చేశాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. సాధనకు స్టార్ ఆటగాళ్లకు మినహాయింపు ఇవ్వడమే ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్. వ్యక్తిగత పనుల కోసం లేదా ప్రాక్టీస్లో గాయపడతారనే ఉద్దేశంతో స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంటారు. ఇకపై వాళ్లకు ఆ ఛాన్స్ లేదు.
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం భారత బ్యాటర్ల బలహీనతలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సహా స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. ఈ క్రమంలో బ్యాటర్లకు స్పిన్ ప్రాక్టీస్కు ప్రత్యేక సెషన్ గంభీర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటర్లకు కళ్లెం వేయడానికి గంభీర్ ప్రత్యేక వ్యూహాలతో బౌలర్లతో సాధన చేయించున్నాడు. కాగా, నవంబర్ 1 నుంచి వాంఖడే వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది.