
తొలుత బ్యాటింగ్ చేసినా..
ఇదివరకు తొలి రెండు మ్యాచ్లల్లో తొలుత ఫీల్డింగ్ చేసింది టీమిండియా. ప్రత్యర్థి 150కి పైగా పరుగులు చేసినా.. దాన్ని అలవోకగా ఛేదించింది. ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసినా.. రిజల్ట్లో మాత్రం తేడా రాలేదు..రానివ్వలేదు. ప్రత్యర్థి బౌలర్లపై పిడుగుల్లాంటి షాట్లతో విరచుకుపడ్డారు టీమిండియా బ్యాటర్లు. ప్రత్యేకించి- రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లోనూ దూకుడును మరింత పెంచాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు.

మెరిసిన ఐపీఎల్ స్టార్లు..
ఆ తరువాత క్రీజ్లోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతో 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. వెంకటేష్ అయ్యర్కు ఈడెన్ గార్డెన్స్ ఓ రకంగా హోమ్ పిచ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అతను కోల్కత నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఐపీఎల్లో ఇదే పిచ్పై టన్నుల కొద్దీ పరుగులు చేసిన అనుభవం అతని సొంతం.

బౌలింగ్లోనూ రాణించిన..
బౌలింగ్లోనూ సత్తా చాటాడు వెంకటేష్ అయ్యర్. మూడు ఓవర్లల్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లోనూ ఫర్వాలేదనిపించుకున్నాడు. హర్షల్ పటేల్, దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్, బౌలింగ్లో ఆల్రౌండర్ టాలెంట్ను ప్రదర్శించారు. టీమిండియా విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. రెండో టీ20 మ్యాచ్లోనూ హర్షల్ పటేల్ రెండు వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్లోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈష్ సోధి, జిమ్మి నీషమ్లను పెవిలియన్ దారి పట్టించాడు.

యంగ్స్టర్లకు ట్రోఫీ..
మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మ.. దాన్ని యంగ్ క్రికెటర్ల చేతికే అప్పగించాడు. వెంకటేష్ అయ్యర్ చేతికి ట్రోఫీని అప్పగించి.. తాను మాత్రం ఓ చివరన వెళ్లి నిల్చున్నాడు. సాధారణంగా ట్రోఫీని గెలుచుకున్న తరువాత నిర్వహించే సెలెబ్రేషన్స్లో కేప్టెన్.. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలబడటాన్ని మనం ఇదివరకు చాలాసార్లు చూశాం. దీనికి భిన్నంగ కేప్టెన్ రోహిత్ శర్మ.. సెలెబ్రేషన్స్కు దూరంగా నిల్చున్నాడు. యంగ్ క్రికెటర్లకు ప్రోత్సహించాడు. ఇదొక అరుదైన సన్నివేశం. రోహిత్ శర్మ చేసిన ఈ చర్య పట్ల అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తేస్తోన్నారు.


Click it and Unblock the Notifications












