వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఔటైన తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో వికెట్ను చేజార్చుకున్న తరహాలోనే గిల్ ఔటవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇంకెన్ని సార్లు అదే రీతితో వెనుదిరుగుతావని గవాస్కర్ అన్నాడు.
రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ కోల్పోయాడు. బంతి దూరంగా స్పిన్ అవుతుందని భావించి బ్యాటుతో ఢిఫెన్స్ చేయడానికి గిల్ ప్రయత్నించలేదు. కానీ బంతి ఆఫ్ స్టంప్పైకి దూసుకొచ్చింది. తన ప్యాడ్లతో డిఫెన్స్ చేసినా గిల్ అంపైర్ నిర్ణయంతో ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకునేవాడు.

కానీ గిల్ అలా చేయలేదు. ఔటైన అనంతరం బంతి తీరును చూసి క్రీజులోనే నోరెళ్లబెట్టాడు. అయితే గిల్ ఔటైన తీరుపై వ్యాఖ్యాతగా ఉన్న గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''బంతిని వదిలేస్తూ గిల్ ఔటవ్వడం మనం ఇంకెన్ని సార్లు చూడాలి? బంతిని అంచనా వేయడంలో విఫలమై స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు తన వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఏ బంతిని వదిలెయ్యాలి? ఏ బంతిని ఆడాలి? అనే దానిపై గిల్ సాధన చేయాలి'' అని గవాస్కర్ అన్నాడు.
కాగా, 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం లంచ్ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 55 పరుగులు అవసరం. క్రీజులో రిషభ్ పంత్ (53 నాటౌట్; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్; 8 బంతుల్లో) ఉన్నారు. అయితే ఛేదనలో భారత్ 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది.
రోహిత్ శర్మ (11) చెత్త షాట్తో వికెట్ చేజార్చుకున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్ తన బలహీనత అని విరాట్ కోహ్ (1)లి మరోసారి నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (1) ఫుల్ టాస్ బంతికి వెనుదిరిగాడు. యశస్వీ జైస్వాల్ (5) వికెట్ల ముందు దొరికిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ నాలుగు వికెట్లు, హెన్రీ, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు.
Gill castled 💥
— JioCinema (@JioCinema) November 3, 2024
Watch Day 3 LIVE on #JioCinema #Sports18 & ColorsCineplex👈#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/HTdvnvcrdq