పుణె వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టులో వ్యాఖ్యాతగా ఉన్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డిఫెన్సివ్ కెప్టెన్సీ చేస్తున్నాడని, రోహిత్ ఓ నెగిటివ్ కెప్టెన్ అని మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..
తొలి రోజు రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ 31 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (47 బ్యాటింగ్; 108 బంతుల్లో, 5 ఫోర్లు), రచిన్ రవీంద్ర (5 బ్యాటింగ్; 13 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ టామ్ లాథమ్ (15; 22 బంతుల్లో, 2 ఫోర్లు), విల్ యంగ్ (18; 45 బంతుల్లో, 2 ఫోర్లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.

స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై తొలి సెషన్లో న్యూజిలాండ్ కేవలం రెండు వికెట్లే కోల్పోయి 92 పరుగుల చేసి టీమిండియాపై ఆధిపత్యం చెలాయించింది. అయితే దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇస్తూ రోహిత్ చేసిన ఫీల్డింగ్ సెటప్పై విమర్శలు వస్తున్నాయి.
కామెంటరీలో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ శర్మ ఫీల్డింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎటాకింగ్ ఫీల్డింగ్ బదులుగా డిఫెన్సివ్ కెప్టెన్సీ చేస్తున్నాడని అన్నాడు. ప్రత్యర్థి దూకుడుగా ఆడకముందే లాంగాన్, లాంగాఫ్లో ఫీల్డర్లను మోహరించడమేంటని ప్రశ్నించాడు. ఇది డిఫెన్సివ్ కెప్టెన్సీ అని, రోహిత్ నెగటివ్ కెప్టెన్ అని పేర్కొన్నాడు.
తొలి సెషన్లో భారత బౌలర్లు 31 ఓవర్లలో వేయగా అందులో స్పిన్నర్లే 24 ఓవర్లు బౌలింగ్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 12 ఓవర్లు, వాషింగ్టన్ సుందర్ 7, రవీంద్ర జడేజా 5 ఓవర్లు వేశారు. అయితే బౌండరీలకు ఛాన్స్ ఇవ్వొద్దని రోహిత్ ఫీల్డింగ్ సెటప్ చేయగా, కివీస్ బ్యాటర్లు సులువుగా సింగిల్స్ తీస్తూ స్ట్రైకింగ్ రొటేట్ చేస్తున్నారు. దీంతో ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం న్యూజిలాండ్కు లభిస్తుందని విశ్లేషకుల వాదన.