న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(100; 122 బంతుల్లో, 10 ఫోర్లు) శతకంతో విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (59 నాటౌట్; 63 బంతుల్లో, 6 ఫోర్లు) ఆకట్టుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ హాల్లీడే(86; 96 బంతుల్లో, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జియా ప్లిమ్మర్(39; 67 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్లు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ(3/39) మూడు వికెట్లు, ప్రియా మిశ్రా(2/41) రెండు వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్ (1/49), సైమా ఠాకూర్ (1/44) చెరో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో భారత్ 45.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. షెఫాలీ వర్మ (12) ఆదిలోనే ఔటైనప్పటికీ యస్తికా భాటియా (35), హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి స్మృతి మంధాన ఇన్నింగ్స్ చక్కదిద్దింది. రెండో వికెట్కు 76 పరుగులు, మూడో వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో 121 బంతుల్లో శతకం అందుకున్న స్మృతి అరుదైన ఘనత అందుకుంది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత మహిళా ప్లేయర్గా స్మృతి చరిత్ర సృష్టించింది.
వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ. కాగా, అంతకుముందు ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉంది. మాజీ కెప్టెన్ మిథాలీ ఏడు సెంచరీలు సాధించింది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి మంధాన (8), మిథాలీ రాజ్ (7), హర్మన్ప్రీత్ కౌర్ (6), పూనమ్ రౌత్ (3) టాప్లో ఉన్నారు.
That HUNDRED Feeling 💯🤗
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H