వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ ఏడాది సొంతగడ్డపై భారత్ ఓడిన టెస్టులు నాలుగు. 1969 తర్వాత స్వదేశంలో ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. 148 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక ఈ అపకీర్తి మూటగట్టుకుంది. ఛేదన ఆరంభం నుంచి భారత్ తడబడింది. పేలవ బ్యాటింగ్తో 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది.

అయితే ఈ ఘోర పరాజయంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై టీమిండియా వైట్ వాష్ అవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓటమికి మూడు కారణాలను చెప్పాడు. సన్నద్ధత లోపం, చెత్త షాట్ల ఎంపిక, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం ఘోర పరాజయానికి కారణాలు అంటూ పేర్కొన్నాడు. భారత జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసిన శుభ్మన్ గిల్, రెండు ఇన్నింగ్స్ల్లో అర్ధశతకాలు బాదిన రిషభ్ పంత్ను సచిన్ కొనియాడాడు.
''సొంతగడ్డపై 0-3తో టెస్టు సిరీస్ కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఇది. సన్నద్ధత లోపమా? పేలవ షాట్ల ఎంపికనా? లేదా మెరుగైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా? తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ దృఢత్వాన్ని ప్రదర్శించాడు. రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో గొప్పగా ఆడాడు. తన ఫుట్ వర్క్తో కఠినమైన పిచ్ను విభిన్నమైనదిగా చూపించాడు. అతను నిజంగా ఓ అద్భుతం. ఇక న్యూజిలాండ్కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. సిరీస్ మొత్తం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత్పై 3-0తో గెలవడం గొప్ప ఫలితం'' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.