వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
మరోవైపు స్వదేశంలో ఓ టెస్టు సిరీస్లో వైట్ వాష్కు గురికావడం భారత్కు ఇదే తొలిసారి. ఛేదన ఆరంభం నుంచి భారత్ తడబడింది. 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జడేజా (6)తో కలిసి పంత్ ఆరో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పంత్ ఉన్నంతసేపే టీమిండియా విజయం దిశగా సాగింది. పంత్ మినహా రోహిత్ శర్మ (11), వాషింగ్టన్ సుందర్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

అయితే మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వడం బాధగా ఉందని అన్నాడు. ఈ సిరీస్లో ఘోర తప్పిదాలు చేశామని, న్యూజిలాండ్ మెరుగ్గా ఆడిందని పేర్కొన్నాడు. బ్యాటర్గా, కెప్టెన్గా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని తెలిపాడు. ''టెస్టు మ్యాచ్, టెస్టు సిరీస్ కోల్పోవడం అంత తేలికైన విషయం కాదు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. దాన్ని మేం అంగీకరించి తీరాలి. మా కంటే న్యూజిలాండ్ ఎంతో బాగా ఆడింది''
''మొదటి రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్ల్లో మేం మెరుగైన స్కోరు చేయలేదు. అది ఆ మ్యాచ్ల్లో మేం వెనుకపడేలా చేసింది. కానీ ఈ మ్యాచ్లో 30 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. మ్యాచ్లో మాదే పైచేయి, లక్ష్యం ఛేదించగలిగినదే. కానీ మేం అందుకోవడంలో విఫలమయ్యాం. ఇక నా బ్యాటింగ్ విషయానికి వస్తే, ఈ సిరీస్లో రాణించలేకపోవడం నిరాశ కలిగించింది. ఈ పిచ్పై ఎలా ఆడాలో రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, గిల్ చక్కగా చూపించారు''
''గత మూడు నాలుగేళ్ల నుంచి ఈ పిచ్లపై ఆడుతున్నాం. ఇక్కడ ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. కానీ ఈ సిరీస్లో అలా జరగలేదు. బ్యాటర్గా, కెప్టెన్గా నా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. అది నన్ను ఎంతో కలచివేస్తోంది. అయితే జట్టుగా మేం మంచి ప్రదర్శన చేయలేకపోయాం. అదే మా ఓటమికి కారణం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.