వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
మరోవైపు స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురికావడం ఇదే తొలిసారి. ఛేదన ఆరంభం నుంచి భారత్ తడబడింది. 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జడేజా (6)తో కలిసి పంత్ ఆరో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పంత్ ఉన్నంతసేపే టీమిండియా విజయం దిశగా సాగింది. పంత్ మినహా రోహిత్ శర్మ (11), వాషింగ్టన్ సుందర్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

అయితే పంత్ ఔట్ వివాదాస్పదంగా మారింది. అది నాటౌట్ అని మైదానంలో అంపైర్లతో పంత్ వాదించాడు. కానీ సమీక్షలో థర్డ్ అంపైర్ ఔట్ అని తేల్చడంతో పంత్ బాధతో పెవిలియన్కు చేరాడు. కాగా, మ్యాచ్ అనంతరం దాని గురించి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అంపైర్ నిర్ణయాన్ని రోహిత్ తప్పుపట్టాడు. ఔట్ అని స్పష్టంగా తెలియని సందర్భంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో థర్డ్ అంపైర్ ఏకీభవించాల్సి ఉందని రోహిత్ అన్నాడు.
ఆ సమయంలో పంత్ బ్యాటు ప్యాడ్కు తాకిందని అందరికీ తెలుసని, కానీ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ ఎందుకు వ్యతిరేకించాడో అర్థం కాలేదని రోహిత్ తెలిపాడు. టీమిండియాకు పంత్ వికెట్ ఎంతో కీలకమని, అతను క్రీజులో కుదరుకుని ఉన్నాడని, పంత్ ఉంటే ఫలితం మరోలా వచ్చేదని అన్నాడు. దురదృష్టవశాత్తు పంత్ ఔటయ్యాడని, ఆ తర్వాత ఆలౌట్ అయ్యామని హిట్ మ్యాచ్ చెప్పాడు.
అజాజ్ పటేల్ వేసిన బంతిని ముందుకు వచ్చి పంత్ డిఫెన్స్ చేశాడు. బంతి ప్యాడ్కు తాకి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్ను అందుకుని ఔట్ అంటూ అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. అయితే న్యూజిలాండ్ రివ్యూకి కోరింది. ఒకే రివ్యూ ఉన్నప్పటికీ పంత్ కీలక వికెట్ కావడంతో కివీస్ రిస్క్ తీసుకుంది. సమీక్షలో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్ను ఆధారంగా చేసుకుని పంత్ను ఔట్గా నిర్ణయించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ రీడింగ్ చూపించే సమయంలో పంత్ తన బ్యాటును ప్యాడ్కు తాకించాడు. దాంతోనే అల్ట్రాఎడ్జ్ అలా చూపిస్తుందని పంత్ మైదానంలో అంపైర్లకు వివరించాడు. మరోవైపు థర్డ్ అంపైర్ బంతి గమనం కాస్త మారిందంటూ ఔట్ ఇచ్చాడు.