బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తిరిగి పోటీలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అయిదు సెషన్లు కివీస్ పైచేయి సాధించగా, మూడో రోజు ఆట రెండో సెషన్లో టీమిండియా పుంజుకుంది. ఓటమి కోరల్లో నుంచి బయటపడగలమనే ఆశలను అభిమానులకు కల్పించింది.
శుక్రవారం టీ విరామానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (27; 42 బంతుల్లో, 4 ఫోర్లు), యశస్వీ జైస్వాల్ (29; 49 బంతుల్లో, 5 ఫోర్లు) కుదుకున్నారు. టీమిండియా ఇంకా 299 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే భారత్కు మరో గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇవాళ మైదానంలో అడుగుపెట్టని వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి వస్తున్నాడు.

రెండో సెషన్ అనంతరం విరామ సమయంలో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే పంత్ మునపటిలా చాలా సౌకర్యవంతంగా ఆడట్లేదు. బ్యాటింగ్కు తన మోకాలు సహకరిస్తుందో లేదో అని పరిశీలిస్తున్నాడు. నిదానంగా సాధన చేస్తున్నాడు. గురువారం ఆటలో రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.
రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి గాయమైంది. సర్జరీ అయిన చోటే బంతి తగలడంతో పంత్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా లాభం లేకపోవడంతో అతికష్టంగా మైదానాన్ని వీడాడు. గాయం కారణంగా శుక్రవారం ఆటకు పంత్ అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది. అతని గాయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.
మరోవైపు పంత్ తిరిగి బరిలోకి దిగడానికి సన్నద్ధమవుతున్నాడు. కాస్త కోలుకున్నా పంత్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. అయితే అతను రన్నర్ను పెట్టుకోలేడు. వికెట్ల మధ్య అతనే పరిగెత్తాల్సి ఉంటుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో పంత్తో బీసీసీఐ రిస్క్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అతను క్రీజులోకి వచ్చినా.. గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సింగిల్స్/డబుల్స్ పై కాకుండా బౌండరీలపై దృష్టిసారిస్తూ ఆడాల్సి ఉంటుంది.