వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిషభ్ పంత్ అనాలోచిత నిర్ణయంతో కివీస్ కీలక బ్యాటర్ డారిల్ మిచెల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రోహిత్ శర్మ సూచనలు ఇస్తున్నప్పటికీ పంత్ ఆచరణలో పెట్టకపోవడంతో మిచెల్ బతికిపోయాడు. అనంతరం రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూ పంత్పై మండిపడ్డాడు.
తొలి రోజు ఆటలో 22వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. వాషింగ్టన్ సుందర్ వేసిర ఆఖరి బంతిని డారిల్ మిచెల్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే మిచెల్ రెండు పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. మరోవైపు బౌండరీ లైన్లో సిరాజ్ బంతిని త్వరగా అందుకోవడం గమనించి నాన్స్ట్రైకర్లో ఉన్న విల్ యంగ్ సింగిల్ సరిపోతుందని మిచెల్కు సూచిస్తూ నిదానంగా పరిగెత్తాడు. కానీ డారిల్ మిచెల్ సెకండ్ రన్ కోసం పరుగును కొనసాగించాడు.

అయితే సిరాజ్ వేసిన త్రోను వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందుకొని చూడకుండానే బెయిల్స్ పడగొట్టాలని ప్రయత్నించాడు. కానీ బంతి వికెట్లకు తాకలేదు. మరోవైపు పంత్ బంతి అందుకుంటున్న క్షణంలో స్లిప్ స్థానంలో ఉన్న రోహిత్.. బంతిని బౌలర్కు అందించమని పంత్కు గట్టిగా అరుస్తూ చెప్పాడు. విల్ యంగ్ పిచ్ సగం వరకు కూడా వెళ్లలేదని త్రోను నాన్స్ట్రైకర్ వైపు పాస్ చెయ్యమని చెప్పాడు. కానీ ఆ కంగారూలో పంత్ రోహిత్ మాట వినిపించుకోలేదు. డారిల్ మిచెల్ గురించే ఆలోచిస్తూ విల్ యంగ్ పరుగును అంచనా వేయలేకపోయాడు.
కామెంటరీలో ఉన్న మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దీనిపై మాట్లాడుతూ.. రిషభ్ పంత్ కారణంగానే భారత్ వికెట్ సాధించలేకపోయిందని అన్నాడు. స్ట్రైకర్, నాన్స్ట్రైకర్ రన్నింగ్ను గమనిస్తూ త్రో వేయాల్సిన బాధ్యత వికెట్ కీపర్దే అని పేర్కొన్నాడు. ఈ సందర్భాల్లో వికెట్ కీపర్ గ్లవ్స్ తీసి ఫీల్డర్ నుంచి బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తారని, కానీ పంత్ అలా కూడా చేయలేదని, తప్పుగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడని డీకే తెలిపాడు.
అయితే 3 పరుగుల వద్ద లైఫ్ దక్కించుకున్న డారిల్ మిచెల్ అర్ధశతకం సాధించాడు. 90 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. 3 ఫోర్లు బాదాడు. కాగా, న్యూజిలాండ్ ప్రస్తుతం 52 ఓవర్లకు 183/5 స్కోరు చేసింది.