బంగ్లాదేశ్ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్స్వీప్ చేసిన భారత్ స్వదేశంలో మరో సిరీస్కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్లో అందరి దృష్టి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపైనే ఉంది. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కోహ్లి మరోసారి కనీసం 50 మార్క్ను అందుకోలేకపోయాడు.
గత ఆరు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 99 పరుగులే చేశాడు. అందులో ఒక్కసారి అజేయంగా నిలిచాడు. కుదురుకున్నట్లు అనిపిస్తూ కోహ్లి వికెట్ను చేజార్చుకోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఫామ్ గురించి టీమిండియా కెప్టెన్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ప్రతి మ్యాచ్కు కోహ్లి ఫామ్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని, కోహ్లి వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అన్నాడు.

''విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ క్రికెటర్. అతను ఎంతో కాలంగా చక్కని ప్రదర్శన చేస్తున్నాడు. అరంగేట్ర సమయంలో కోహ్లి ఎంతో పరుగల ఆకలితో ఉన్నాడు. ఇప్పటికీ అదే ఆకలితో రగిలిపోతున్నాడు. ఈ ఆకలే అతన్ని వరల్డ్ క్లాస్ ప్లేయర్ను చేసింది. న్యూజిలాండ్ సిరీస్లో అతను కచ్చితంగా సత్తాచాటుతాడని, అలాగే జోరును ఆస్ట్రేలియా సిరీస్లోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నా''
''ప్రతి మ్యాచ్ తర్వాత ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మ్యాచ్ మ్యాచ్కు జడ్జ్ చేయడం సరైనది కాదు. ఇది ఆట, కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవుతుంటారు. ప్రతిరోజు గొప్ప రోజుగా ఎవరికీ ఉండదు. మా ఆటగాళ్లకు మేం మద్దతు ఇస్తాం. జట్టుకు సరిపోయే 11 మందిని ఎంపిక చేయడం నాపని. జట్టు నుంచి ఆటగాళ్లను తొలగించడం కాదు. మేం జట్టుగా మంచి ఫలితాలు సాధిస్తుండటం బాగుంది'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. పుణె వేదికగా అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు జరగనుంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరాలంటే ఈ సిరీస్ విజయం సాధించడం భారత్కు ఎంతో కీలకం.