బంగ్లాదేశ్ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు కివీస్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమవ్వగా, ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మెకాలి గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి సియర్స్ అందుబాటులో ఉండట్లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

బెన్ సియర్స్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ జాకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు వెల్లడించింది. శ్రీలంక పర్యటనలో బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాధపడ్డాడు. అయితే గత వారంలో న్యూజిలాండ్లో స్కాన్ చేయించుకోగా, తాజాగా గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సియర్స్ స్థానంలో జాకబ్ను తీసుకుంది. న్యూజిలాండ్ తరఫున జాకబ్ ఆరు వన్డేలు, 14 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 269 వికెట్లు పడగొట్టాడు.కాగా, బెన్ సీయర్స్ ఒక్క టెస్టు, 17 టీ20లు ఆడాడు. ఏకైక టెస్టులో 5 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, జాకబ్ డపీ, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.