ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ తుది పోరులో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ పోరులో భారత్ కు గట్టి సవాల్ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. టీమిండియాను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కివీస్కు చెందిన ఓ ప్రమాదకర ఆటగాడు ఈ ఫైనల్ బరిలోకి దిగనున్నాడు.
అతడు మరెవరో కాదు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాథ్యూ హెన్రీ. వాస్తవానికి అతడు గాయం కారణంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆడలేదు. దీంతో అతడు ఫైనల్ లో కూడా ఆడడని అంతా భావించారు. కానీ ఇప్పుడతడు తుది పోరు బరిలోకి దిగుతాడని స్పష్టత ఇచ్చాడు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్. దీంతో భారత జట్టుకు ఓ తలనొప్పి వచ్చి పడిందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

ఎందుకంటే మ్యాథ్యూ హెన్రీకి భారత్ పై వన్డేల్లో మంచి రికార్డు ఉంది. అతడు భారత్ పై 11 వన్డేలు ఆడి 21 వికెట్లు తీశాడు. భారత్ పై అతడి బౌలింగ్ యావరేజ్ 21, ఎకానమీ 4.48, స్టైక్ రేట్ 28గా ఉంది. మొత్తంగా ఇది మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇది. వన్డేల్లో నెదర్లాండ్, శ్రీలంక తర్వాత భారత్ పై అతడు అద్భుతంగా రాణించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచులోనూ.. దుబాయ్ లో భారత్ పై హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి 42 పరుగులు చేశాడు. భారత్ పై అతడికి బెస్ట్ బౌలింగ్ పెర్ ఫార్మెన్స్. దుబాయ్ లాంటి స్లో పిచ్ పై తన ఫాస్ట్ బౌలింగ్ తో మ్యాథ్యూ హెన్రీ మంచి ప్రభావం చూపించగలడు. పైగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తరచుగా అతడి బౌలింగ్ లో వికెట్ కోల్పోతున్నాడు. కాబట్టి అతడు తిరిగి రావడం కూడా భారత్ పై ఒత్తిడి పెంచే విషయమనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ లో అతడు కీలకంగా రాణిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి నుంచి భారత్ కు ముప్పు ఉందనే చెప్పాలి. కాబట్టి భారత్ జట్టు అతడిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరముంది.