బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో గొప్పగా పోరాడి టీమిండియా పోటీలోకి వచ్చింది. కానీ కివీస్ ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
మొదటి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులే చేయగా, న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (134), డెవాన్ కాన్వే (91) సత్తాచాటారు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ (150), రిషభ్ పంత్ (96), విరాట్ కోహ్లి (70) పోరాడారు. 107 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన కివీస్ రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.

అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా పెవిలియన్ చేరుతుంటే కేఎల్ రాహుల్ మాత్రం భిన్నంగా ప్రవర్తించాడు. మొదట సహచరులతో కలిసి రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ వైపే పయనించాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి వచ్చి పిచ్కు మొక్కి వెళ్లాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఇలా చేయడం చర్చనీయాంశమైంది.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినున్నాడని, సొంతమైదానంలో తన ఆఖరి మ్యాచ్ ముగియడంతో భావోద్వేగంతో పిచ్ను తాకి వెళ్లాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టెస్టు జట్టులో మిడిలార్డర్ బ్యాటర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఇటీవల తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో అతని స్థానంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్లో డకౌటైన రాహుల్ రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులే చేశాడు.
KL Rahul touching the Bengaluru pitch after the match. pic.twitter.com/csCJJoy8m3
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2024
అయితే ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన రాహుల్ గాయాల కారణంతో టెస్టులు ఎక్కువగా ఆడలేకపోతున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా సెంచరీ సాధించిన తర్వాత అయిదు టెస్టులే ఆడాడు. ఇంగ్లండ్పై 86, బంగ్లాదేశ్పై 68 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ అతని స్థానానికి సర్ఫరాజ్ బలమైన పోటీ ఇస్తున్నాడు. కాగా, రాహుల్ యథాలాపంగానే పిచ్కు మొక్కి ఉండొచ్చని, రిటైర్మెంట్ ఇవ్వాలనే ఆలోచన లేదని నెట్టింట్లో కొందరు వాదిస్తున్నారు.