బంగ్లాదేశ్ను 2-0తో చిత్తు చేసిన భారత్ స్వదేశంలో మరో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో ముందుంజలో ఉండాలంటే భారత్-న్యూజిలాండ్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.
అయితే ఈ కీలక సిరీస్ ప్రారంభానికి ముందే కివీస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక మిగిలిన రెండు టెస్టుల్లోనూ విలియమ్సన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గజ్జల్లో నొప్పి కారణంగా అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో విలియమ్సన్ గజ్జల్లో అసౌకార్యానికి గురయ్యాడు. భారత్లో జట్టుతో అతను చేరడానికి ముందు పూర్తిగా కోలుకోవడానాకి పునరావసం చేయించుకోవాల్సి ఉంది. కేన్ గాయం తీవ్రతరం చేయడం కంటే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమంగా భావిస్తున్నాం. అతను త్వరగా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. పర్యటన ప్రారంభం నుంచే విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం నిరాశను కలిగించే అంశం'' అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటనలో వెల్లడించింది.
కేన్ విలియమ్సన్ స్థానంలో బ్యాకప్ ఆటగాడిగా మార్క్ చాప్మన్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 23 వన్డేలు, 76 టీ20లు ఆడిన చాప్మన్ టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి 41.9 సగటు ఉంది. ఉపఖండ పిచ్లపై స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడనే ఉద్దేశంతో అతనికి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.
మరోవైపు తన భార్య రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో మైకేల్ బ్రేస్వెల్ తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. చివరి రెండు టెస్టులకు అతని స్థానంలో ఇష్ సోథి ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్ టెస్టు జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.