సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాభవం ఎదురైంది. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్ను 0-2తో చేజార్చుకుంది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది.చివరి అయిదు మ్యాచ్లు ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో న్యూజిలాండ్తో జరిగే మూడో టెస్టులో భారత్ తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఉన్న ప్రయోజనాలను ఉపయోగించుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. పిచ్ను సిద్ధం చేయడంలో క్యురేటర్కు కీలక సూచనలు ఇచ్చింది.

ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధం కావాలని తొలి టెస్టు పిచ్ను పేస్ అనుకూలించేలా రోహిత్-గంభీర్ సిద్ధం చేయించారు. కానీ అది న్యూజిలాండ్కు కలిసొచ్చింది. ఇక రెండో టెస్టుకు టీమిండియా యూటర్న్ తీసుకుని స్పిన్కు అనుకూలించేలా చేశారు. ఈ వ్యూహం కూడా ఫలించలేదు. తక్కువగా టర్న్ అయినప్పటికీ అనూహ్య బౌన్స్తో భారత బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. అంతేగాక స్పిన్లో మన బ్యాటర్ల బలహీనత బయటపడింది.
ఈ క్రమంలో శుక్రవారం నుంచి వాంఖడేలో జరగనున్న మూడో టెస్టుకు పిచ్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. అయితే ఈ మ్యాచ్కు ర్యాంక్ టర్నర్ పిచ్ను సిద్ధం చేయమని రోహిత్-గంభీర్ పిచ్ క్యురేటర్కు సూచించారు. ఈ పిచ్పై బంతి మొదటి రోజు నుంచే టర్న్ అవుతుంది. ''ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండనుంది. తొలి రోజు నుంచే స్పిన్కు అనుకూలించేలా పిచ్ను సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ సూచించింది'' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వడం టీమిండియా బ్యాటర్లకు కూడా కష్టమే. మిచెల్ శాంట్నర్ రెండో టెస్టులో 13 వికెట్లతో విజృంభించాడు. అయితే తమ బ్యాటర్ల సామర్థ్యంపై నమ్మకంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మన స్పిన్ ఆయుధంతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు.