ముంబై: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా గత ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా సెమీస్కు చేరాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే. ఆదివారం న్యూజిలాండ్తో భారత్ కోహ్లీసేన తలపడనుంది. ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. మరోవైపు పాకిస్తాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ పరిస్థితి కూడా అంతే. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని అభిమానులు భావిస్తున్నారు. అయితే న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో ఆ మ్యాచును క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇదే గ్రూప్లో అఫ్గానిస్థాన్ కూడా ప్రమాదకరమైన జట్టేనని అభిప్రాయపడ్డాడు.
గ్రూప్-2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి టైటిల్ రేసులో ఫేవరెట్గా ముందుకు దూసుకెళుతోంది. గత ఆదివారంటీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన పాక్.. మంగళవారం న్యూజిలాండ్పైనా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. దాంతో గ్రూప్-2లోని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్ల్లో పాక్.. అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలను లాంటి చిన్న జట్లను ఎదుర్కోనుంది. ప్రస్తుతం ఫామ్ దృష్ట్యా ఈ జట్లను ఓడించడం బాబర్ సేనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. దాంతో పాక్ సెమీస్కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Quinton de Kock: క్షమాపణలు చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్.. ఇకనుంచి మోకాళ్లపై కూర్చుంటా!!
గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్లో అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి. దీంతో ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇందులో ఓడిన జట్టు సెమీస్కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ జట్టు గెలిచినా తన తర్వాతి మ్యాచ్లో అఫ్గానిస్థాన్తో తలపడాల్సి ఉంటుంది. ఇక స్కాట్లాండ్ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించింది అఫ్గాన్. అలాంటప్పుడు టీమిండియాకు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
'న్యూజిలాండ్తో జరగనున్న పోరు క్వార్టర్ ఫైనల్ లాంటిది ఏమాత్రం కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్. అయితే అఫ్గానిస్థాన్ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే. ఏ జట్టునైనా ఓడించగలదు. ఇక భారత్ సెమీస్ చేరాలంటే.. తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్ను ఓడించడం. మన ఆటగాళ్లపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీసేనకు ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకోసం భారత్ సిద్ధంగా ఉందని అనుకుంటున్నా. కచ్చితంగా మనోళ్లు గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్తో తలపడిన రోజు మనదికాదు. ఆ ఓటమి కోహ్లీసేనకు మేలుకొలుపు లాంటిది' అని హర్భజన్ సింగ్ అన్నాడు.