తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత టీమిండియా గొప్పగానే పోరాడింది. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది.
టెస్టు సిరీస్ను నిలుపుకోవాలంటే రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్ను చిత్తు చేసి సిరీస్పై గురిపెట్టాలి. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. అయితే పుణె టెస్టులో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై వేటు పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. 'కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్ ఖాన్' చర్చపై మాట్లాడాడు. తుదిజట్టులో సర్ఫరాజ్ ఖాన్కు ఉన్న అవకాశం గురించి గంభీర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ రాహుల్కు మాత్రం మద్దతు ఇస్తామని తెలియజేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన కాన్పూర్ టెస్టులో రాహుల్ బాగానే రాణించాడని అన్నాడ.
''సోషల్ మీడియా గురించి కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియా, నిపుణుల అభిప్రాయాలతో మేం తుదిజట్టును నిర్ణయించట్లేదు. టీమ్ మేనేజ్మెంట్, నాయకుల బృందం ఏం ఆలోచిస్తుందనేది ఎంతో ముఖ్యం. అంతిమంగా ఎవరైనా అంతర్జాతీయ క్రికెట్లో చర్చకు గురవుతారు. అయితే కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడని భావిస్తున్నాను. కాన్పూర్లో అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కఠిన వికెట్పై అతను ప్రణాళికలు తగ్గట్లుగా ఆడాడు.
''కేఎల్ రాహుల్ భారీ స్కోరు చేయాలనుకుంటున్నాడు. అతని ఆ సామర్థ్యం ఉంది. టీమిండియా మేనేజ్మెంట్ అతనికి మద్దతు ఇస్తుంది'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన రాహుల్, రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులే చేశాడు. మరోవైపు గిల్ గాయంతో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ 0, 150 పరుగులు చేశాడు. దీంతో సర్ఫరాజ్ను తుదిజట్టులో కొనసాగించి, రాహుల్ను పక్కనపెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. కాగా, బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో ఒక్క ఇన్నింగ్స్ ఆడటానికే అవకాశం దక్కగా రాహుల్ 68 పరుగులతో సత్తాచాటాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో ధాటిగా ఆడాడు.