మూడు టెస్టుల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. కివీస్ పేసర్ల ధాటికి మన బ్యాటర్లు వణికిపోతున్నారు. రెండో రోజు ఆటలో లంచ్ విరామానికి 23.5 ఓవర్లలో భారత్ 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. రోహిత్ శర్మ 2, జైస్వాల్ 15 పరుగులకే పెవిలియన్కు చేరారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ను టిమ్ సౌథి చక్కని డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. రూర్క్ వేసిన ఊహించని బౌన్స్ను అంచనా వేయడంలో విఫలమైన గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. గిల్ గాయపడటంతో తుదిజట్టులోకి వచ్చిన సర్ఫరాజ్..డెవాన్ కాన్వే అద్భుత క్యాచ్కు ఔటయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రిషభ్ పంత్ (15 బ్యాటింగ్)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. నానీ ఒరూర్క్ ధాటికి జైస్వాల్, కేఎల్ రాహుల్ (0) నిలవలేకపోయాడు. లంచ్ విరామానికి ఆఖరి ఓవర్లో మ్యాట్ హెన్రీ జడేజాను డకౌట్ చేయడంతో భారత్ 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఆరు వికెట్లు కోల్పోయిన ఆరో అత్యల్ప స్కోరు ఇదే. సొంతగడ్డపై రెండో అత్యల్పం. 1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ చేతిలో 27 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో తక్కువ స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన మ్యాచ్ ఇదే. ఓవరాల్గా 2020లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా తక్కువ స్కోరుకు (19/6) ఆరు వికెట్లు కోల్పోయింది.
అయితే ఈ మ్యాచ్లో మరో చెత్త రికార్డును టీమిండియా నమోదు చేసింది. సొంతగడ్డపై భారత టాప్-7 బ్యాటర్లలో నలుగురు డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్గా ఓ ఇన్నింగ్స్లో టీమిండియా మొదటి ఏడుగురు బ్యాటర్లలో నలుగురు ఖాతా తెరవకుండా వెనుదిరగడం ఇది మూడోసారి. అంతకుముందు 1952, 2014లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ల్లో వికెట్లు సమర్పించుకున్నారు.