ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న న్యూజిలాండ్ - భారత్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో శతకాల మోత మోగుతోన్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభం నుంచి ప్రతీ మ్యాచ్ లోనూ బ్యాటర్లు దాదాపుగా కనీసం ఒక్క సెంచరీ అయినా బాదేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రచిన్ రవీంద్ర, జోస్ ఇంగ్లిష్, తౌహిద్ హృదోయ్, బెన్ డకెట్, జో రూట్, ఇబ్రహీం జద్రాన్, రియాన్ రికెల్టన్, డేవిడ్ మిల్లర్, విరాట్ కోహ్లీ, టామ్ లాథమ్, విల్ యంగ్, గిల్.. వీరంతా శతకాలతో విజృంభించారు. దీంతో ఇప్పుడు ఫైనల్ లోనూ భారత్ - కివీస్ జట్ల ఆటగాళ్లు సెంచరీ నమోదు చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు.
భారత్ నుంచి కోహ్లీ, రోహిత్, గిల్ శతకాలు బాదే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో న్యూజిలాండ్ సంచలనం రచిన్ రవీంద్ర శతకం బాదుతాడని అభిప్రాయపడుతున్నారు. మరి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లో భారత్ తరఫున సెంచరీలు బాదిన వీరులు ఎంతమంది ఉన్నారో తెలుసా?.. ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లో ఇప్పటివరకు దాదా మినహా ఎవరు సెంచరీలు చేయలేదు.

దాదా ఎప్పుడు చేశాడంటే?
ఐసీసీ ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ రెండు సార్లు తలపడ్డాయి. మొదటిసారి 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్ లో పోటీపడ్డాయి. ఈ పోరులో భారత్ పై న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించాడు. ఈ పోరులో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 264/6 చేసింది. గంగూలీ 117 సెంచరీతో చెలరేగాడు. సచిన్ టెండూల్కర్ 69 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో రాహుల్ ద్రావిడ్, వినోద్ కాంబ్లీ, యువరాజ్ సింగ్ నిరాశ పరిచారు. అనంతరం భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కెయిర్న్స్ (113 బంతుల్లో 102) శతకం సాయంతో న్యూజిలాండ్ ఛేదించి విజయాన్ని సాధించింది.