బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 31.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్గా ఇది మూడో అత్యల్ప స్కోరు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్క్ (4/22) ధాటికి.. టీమిండియా బ్యాటర్లు వణికిపోయారు.
ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఏకంగా అయిదుగురు డకౌటయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేదు. 9/1, 9/2, 10/3, 31/4, 33/5, 34/6, 34/7, 39/8, 40/9, 46/10.. ఇలా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. రిషభ్ పంత్ 20, యశస్వీ జైస్వాల్ 13 పరుగులు చేయగా, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో 2 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా ఒక్క పరుగు చేశారు.

విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. మహ్మద్ సిరాజ్ అజేయంగా 4 పరుగులు చేశాడు. భారత్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే బౌండరీలు సాధించారు. జైస్వాల్, పంత్తో పాటు సిరాజ్ బౌండరీ బాదాడు. ఒరూర్క్ వేసిన అవుట్సైడ్ ఆఫ్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ముచ్చటైన షాట్తో సిరాజ్ ఫోర్ సాధించాడు.
అయితే బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై స్టార్ బ్యాటర్లు రోహిత్, కోహ్లి విఫలమవ్వడంపై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. ప్రధాన బ్యాటర్లు కంటే స్పెషలిస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేశాడని మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టులో డీఎస్పీ సిరాజ్ మూడో టాప్ స్కోరర్ అని, నాటౌట్గా నిలిచిన ఏకైక ప్లేయర్ అని సిరాజ్ను కొనియాడుతూ మీమ్స్ వస్తున్నాయి. కాగా, ఇటీవల సిరాజ్ డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణిస్తున్న సిరాజ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్టింగ్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.