
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్స్టార్ యాప్లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు.
ఇప్పటివరకూ టీ20 టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు 16 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్ల్లో కివీస్ గెలుపొందింది. గత ఐదు టీ20ల్లో భారత్ గెలవడం విశేషం. అయితే రెండు ప్రపంచకప్ మ్యాచ్ల్లో కివీస్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య దుబాయ్ మైదానంలో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

ఓడిన జట్టు ఇంటికే
గత ఆదివారం తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్.. ఇటు బ్యాటింగ్లో, అటు బౌలింగ్లో సరిదిద్దుకోవాల్సిన లోపాలు చాలానే ఉన్నాయి. ఇంకో ఓటమికి ఏమాత్రం అవకాశం లేదు. ఓడితే అద్భుతాల కోసం ఎదురు చూడాల్సిందే. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేయనుండగా.. భారత్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మీద గెలిచిన పాకిస్థాన్ అగ్రస్థానంతో సెమీస్ చేరడం లాంఛనమే.
భారత్, కివీస్లు అఫ్గానిస్థాన్తో పాటు పసికూనలు నమీబియా, స్కాట్లాండ్లపై గెలుస్తాయనుకుంటే.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచే రెండో స్థానంతో సెమీస్ చేరే జట్టేదో నిర్ణయిస్తుంది. కాబట్టి ఓడిన జట్టు దాదాపుగా ఇంటిముఖం పట్టినట్లే. పసికూనలున్న ఈ గ్రూపు-2 పేరుకే తేలికైంది. ఒక్క ఓటమితోనే భారత్, కివీస్లు ఎదుర్కొంటున్న పరిస్థితే అందుకు నిదర్శనం.

హార్దిక్కు ఇంకో అవకాశం ఇస్తారా?
లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. అయితే కోహ్లీ, పంత్ తప్ప పాక్ మ్యాచులో అందరూ తేలిపోయారు. ఈ మ్యాచ్లోనైనా అందరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయరేమో చూడాలి. పాక్తో మ్యాచ్లో పరాభవం తర్వాత భారత జట్టులో అత్యంత విమర్శలు ఎదుర్కొన్నది పాండ్యానే.
అతను చాన్నాళ్లుగా పేరుకే ఆల్రౌండర్గా ఉంటున్నాడు కానీ బౌలింగ్ చేయట్లేదు. కేవలం బ్యాటింగ్తో జట్టులో ఉండేంతగా.. మెరుపులు మెరిపించట్లేదు. పాక్తో మ్యాచ్లోనూ దారుణంగా తేలిపోయాడు. హార్దిక్ బౌలింగ్ చేయనపుడు స్పెషలిస్టు బ్యాట్స్మన్గా ఇషాన్ కిషన్ను ఎంచుకోవచ్చు. బౌలింగే ప్రధానమనుకుంటే కావాలనుకుంటే బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్ను తీసుకోవచ్చు. మరి కివీస్తో మ్యాచ్లో హార్దిక్పై వేటు పడుతుందా.. లేక హార్దిక్కు ఇంకో అవకాశం ఇస్తారో చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ అంచనాలకు తగ్గట్లు చెలరేగడం భారత్కు కీలకం. భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఠాకూర్ను తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పాక్పై ప్రభావం చూపలేకపోయిన వీళ్లు గాడిన పడితే జట్టుకు ఎదురుండదు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా కూడా మాయ చేయాలని జట్టు ఆశిస్తోంది

జోరు మీద లేని కివీస్
మరోవైపు న్యూజిలాండ్కు కూడా ఇది చావో రేవో మ్యాచ్ కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తుందనడంతో సందేహం లేదు. అయితే బ్యాటింగ్లో కివీస్ ఇబ్బందుల ఎదుర్కోంటోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరైన ఫామ్లో లేడు. మార్టిన్ గప్తిల్కు గాయమైంది. విలియమ్సన్ మ్యాచ్ ఆడటం ఖాయమే కానీ.. గప్తిల్ విషయం తేలాల్సి ఉంది.
కేన్, గప్తిల్లతో పాటు డారిల్ మిచెల్, దేవాన్ కాన్వే, జోష్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టీమ్ సీఫర్ట్లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. నీషమ్, శాంట్నర్ బ్యాటుతో, బంతితో రాణించగలరు. అయితే బ్యాటర్లలో ఎవ్వరూ అంత జోరు మీద లేకపోవడం భారత్కు కలిసొచ్చే అంశం. సరైన ఫినిషర్ కూడా కివీస్కు లేడు. ఇది మనకు కలిసొచ్చే అంశమే. టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ కీలక మ్యాచ్ల్లో గొప్పగా బౌలింగ్ చేస్తారు. వారికి భారత బ్యాట్స్మెన్పై మంచి అవగాహన ఉంది. శాంట్నర్, ఇష్ సోధీలతో కివీస్ స్పిన్ కూడా బాగానే ఉంది.

టాస్ కీలకం
దుబాయ్ పిచ్ ఆరంభంలో స్వింగ్కు, ఆ తర్వాత స్పిన్కు అనుకూలించే అవకాశాలున్నాయి. మంచు ప్రభావం ఉండనుండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ గెలిస్తే సగం పనైట్లే. ఈ ప్రపంచకప్లో అన్ని జట్ల పరిస్థితి ఇదే. టాస్ నెగ్గితే జట్లు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. అది ఆ జట్లకు చాలా కలిసొస్తోంది కూడా. ఈ ఏడాది దుబాయ్లో జరిగిన 20 మ్యాచ్ల్లో 14 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో కూడా టాస్ చాలా కీలకమే అనడంలో సందేహం లేదు. ఒకవేళ టాస్ ఓడి బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారత్.. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడుతుందో చూడాలి.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, శార్దూల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిషెల్, విలియమ్సన్ (కెప్టెన్), దేవాన్ కాన్వే, టీమ్ సీఫర్ట్, జేమ్స్ నీషమ్, జోష్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, ట్రెంట్ బోల్ట్, టీమ్ సౌథీ.
డ్రీమ్ 11 టీమ్:
లోకేష్ రాహుల్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, టిమ్ సౌథీ.


Click it and Unblock the Notifications












