న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురికావడం ఇదే తొలిసారి.
అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ను టీమిండియా టెస్టు క్రికెట్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ పెరుగుతోంది. టీ20, వన్డేల ఫార్మాట్కు మాత్రమే గంభీర్ను కోచ్ నియమించి, టెస్టు బాధ్యతలు వీవీఎస్ లక్ష్మణ్కు ఇవ్వాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్తో పోలిస్తే లక్ష్మణ్కు అపారమైన అనుభవం సొంతం. గంభీర్ 58 టెస్టులు ఆడగా, లక్ష్మణ్ 134 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో ప్రతికూల పరిస్థితుల నుంచి జట్టును ఆదుకోవడంలో లక్ష్మణ్కు గొప్ప అనుభవం ఉంది.

ఈ నేపథ్యంలో గంభీర్ స్థానంలో లక్ష్మణ్ను కోచ్గా నియమించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ తాత్కాలిక టీమిండియా కోచ్గా అప్పుడప్పుడు బాధ్యతలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య సేనకు కోచ్గా లక్ష్మణ్ ఉన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం గంభీర్ పనితీరుపై బీసీసీఐ సమీక్ష నిర్వహించి, నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ కోచ్గా బాధ్యతలు అందుకున్నాడు. అయితే కోచ్గా గంభీర్ హయాంలో టీమిండియా కోరుకోని రికార్డులు నమోదుచేసింది. శ్రీలంక పర్యటనతో టీమిండియా కోచ్గా గంభీర్ యాక్షన్ మొదలుపెట్టగా .. లంకపై టీ20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత లంకతో వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోవడం ఇదే ప్రథమం. అంతేగాక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా అన్ని మ్యాచ్ల్లో ఆలౌటైంది. భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే చరిత్రలో ఇలా జరడం ఇదే తొలిసారి.

ఇక న్యూజిలాండ్తో జరిగిన బెంగళూరు టెస్టులో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోరు. అయితే ఈ పేలవ రికార్డులకు ఆటగాళ్లు ప్రధానంగా బాధ్యత వహించాల్సినప్పటికీ, కోచ్ గంభీర్ వ్యూహాలపై విమర్శలు వచ్చాయి. టీ20 తరహాలో బ్యాటింగ్ ఆర్డర్ను టెస్టుల్లో మార్చడం, టాస్ గెలిచిన తర్వాత ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడం, ఫీల్డింగ్ మోహరించడంలో కెప్టెన్కు మెరుగైన సూచనలు అందివ్వకపోవడం, పేలవమైన తుదిజట్టు ఎంపిక.. వంటి విషయాలపై గంభీర్ బాధ్యత వహించాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.