IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా చివరి, ఐదో టీ20 మ్యాచ్ నేడు(శనివారం) కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ.. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు ఇది చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి కేరళ స్టార్ సంజూ శాంసన్పైనే ఉంది.
సొంత గడ్డపై సంజూకు అగ్నిపరీక్ష!
సొంతగడ్డపై సంజూ శాంసన్ ఆడుతుండటంతో స్థానిక అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సిరీస్లో సంజూ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత 4 మ్యాచ్ల్లో సంజూ శాంసన్ వరుసగా 10, 6, 0, 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన అవకాశాలను సంజూ అందిపుచ్చుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత అభిమానుల ముందే సంజూ శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించి'వాటర్ బాయ్'గా పరిమితం చేస్తారా? అన్న చర్చ మొదలైంది.

ఇషాన్ కిషన్ రాకతో మారుతున్న లెక్కలు
చిన్నపాటి గాయం కారణంగా నాలుగో టీ20కి దూరమైన ఇషాన్ కిషన్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. శుక్రవారం నెట్స్లో ఇషాన్ కిషన్ గంటకు పైగా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఇషాన్ కిషన్ అందుబాటులోకి రావడంతో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్ను తప్పించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ సంజూ శాంసన్ను జట్టులో ఉంచాలనుకుంటే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి ఇషాన్ కిషన్ను కూడా జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంటుంది.
బౌలింగ్లో కీలక మార్పులు
ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జట్టు యాజమాన్యం కొన్ని మార్పులు చేసేలా కనిపిస్తోంది. వర్క్ లోడ్ కారణంగా హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి, అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవచ్చు. గత రెండు మ్యాచ్ల్లో విశ్రాంతి తీసుకున్న వరుణ్ చక్రవర్తిని రవి బిష్ణోయ్ స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. కుల్దీప్ కూడా ఈ మ్యాచ్లో తన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు.
భారత తుది జట్టు (అంచనా)
సంజూ శాంసన్/ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్.