సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఊహించని పరాభవాన్ని చవిచూసిన భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్లో ముంబైలోని వాంఖడే వేదికగా నేటి నుంచి ఆఖరి మ్యాచ్ ఆడనుంది. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. వైట్ వాష్ నుంచి తప్పించుకోవడానికే కాకుండా, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే వాంఖడే టెస్టు విజయం భారత్కు తప్పనిసరిగా మారింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది.చివరి అయిదు మ్యాచ్లు ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో నేటి మ్యాచ్లో భారత్ విజయఢంకా మోగించి ఒత్తిడిని తగ్గించుకోవాలని చూస్తోంది. కాగా, టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఆడిన తరహాలోనూ ఈ మ్యాచ్ ఆడుతామని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ పేర్కొన్నాడు.

జట్టులో రెండు మార్పులు ఉన్నాయని చెప్పాడు. గాయం కారణంగా రెండో టెస్టులో 13 వికెట్లు తీసిన మిచెల్ శాంట్నర్ స్థానంలో ఇష్ సోధి జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. అలాగే టిమ్ సౌథి బౌలింగ్లో మ్యాట్ హెన్రీ ఆడనున్నాడు. మరోవైపు భారత జట్టులోనూ ఓ మార్పు చోటు చేసుకుందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అనారోగ్యం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడట్లేదని, అతని స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం మ్యాచ్పై దృష్టి పెడుతున్నామని రోహిత్ చెప్పాడు. ఈ సిరీస్లో రాణించలేకపోయమని, అయితే తప్పులను సరిచేసుకోవడానికి ఈ మ్యాచ్ మరో అవకాశం అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.
జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోథి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఒరుర్కే.