పుణె వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. సొంతగడ్డపై పుష్కర కాలం నుంచి సిరీస్ కోల్పోని టీమిండియా కివీస్ ముందు తడబడుతోంది. ఓవర్నైట్ స్కోరు 16/1తో శుక్రవారం ఆట ఆరంభించిన రోహిత్ సేన 156 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో చెలరేగాడు. గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీశాడు.
రవీంద్ర జడేజా (38; 46 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జైస్వాల్ (30; 60 బంతుల్లో, 4 ఫోర్లు), శుభ్మన్ గిల్ (30; 72 బంతుల్లో, 2 ఫోర్లు,1 సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్; 21 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. రెండో రోజు ఆట ఆరంభం నుంచే టీమిండియా క్రమంగా వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ను శాంట్నర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని వికెట్ల వేట మొదలుపెట్టాడు.

తన తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లిని ఫుల్ టాస్కు క్లీన్ బౌల్డ్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ ప్రమాదకర ఎడమచేతి వాటం బ్యాటర్లు జైస్వాల్, పంత్ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో ఇవాళ మొదటి సెషన్లో భారత్ 91 పరుగులే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్లో జడేజా, సుందర్ దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్కు ఆధిక్యం కాస్త తగ్గింది.
అయితే న్యూజిలాండ్, భారత్ తొలి ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్లే 19 వికెట్లు పడగొట్టారు. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నమోదైంది. 55 ఏళ్ల తర్వాత భారత్గడ్డపై ఓ టెస్టు తొలి రెండు ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్లే 19 వికెట్లు పడగొట్టడం ఇదే ప్రథమం. 1969లో నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లోనూ తొలి రెండు ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్లు 19 వికెట్లు తీశారు.
ఇక ఓవరాల్గా భారత్ గడ్డపై తొలి రెండు ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీయడం ఇది మూడోసారి. 1952లో కాన్పూర్లో జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టులో మొదటి రెండు ఇన్నింగ్స్లో స్పిన్నర్లే 20 వికెట్లు పడగొట్టారు. కాగా, బెంగళూరు వేదికగా తొలి టెస్టు పిచ్ను పేస్కు అనుకూలించేలా సిద్ధం చేయడంతో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చిందని.. పుణె వికెట్ను స్పిన్నర్లకు కలిసొచ్చేలా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పుణె టెస్టులో భారత్-కివీస్ స్పిన్నర్లు రికార్డు వికెట్లతో చెలరేగుతున్నారు.