తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత టీమిండియా పుంజుకుని గొప్పగానే పోరాడింది. కానీ గెలుపు తీరాలకు చేరుకోలేకపోయింది.
టెస్టు సిరీస్ను నిలుపుకోవాలంటే రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్ను చిత్తు చేసి సిరీస్పై గురిపెట్టాలి. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. అయితే రేపటి మ్యాచ్లో భారత తుదిజట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గాయపడిన శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ పూర్తిగా కోలుకున్నారా? సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్లలో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది. గిల్ గాయపడటంతో తుదిజట్టులో చోటు దక్కించుకన్న సర్ఫరాజ్ 150 పరుగుల కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ను తప్పించి సర్ఫరాజ్ తుదిజట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. కాగా, మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ భారత తుదిజట్టుపై స్పష్టత ఇచ్చాడు.
గిల్, పంత్ కోలుకున్నారని గంభీర్ చెప్పాడు. అలాగే గిల్ తుదిజట్టులోకి వస్తున్నట్లు వివరించాడు. కేఎల్ రాహుల్కు మద్దుతు ఇస్తున్నట్లు తెలిపాడు.''గాయం కారణంగా శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో ఆడలేదు. అంతేకానీ జట్టు నుంచి తప్పించినట్లు కాదు. అతని మెడకు గాయమైంది. బంగ్లాదేశ్ సిరీస్లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. అతను కచ్చితంగా తుదిజట్టులో ఉంటాడు. మిగిలిన వాళ్ల గురించి ఇంకా ఖరారు కాలేదు. ప్లేయింగ్ 11 రేపు ఖరారు అవుతుంది. పుణె టెస్టు మ్యాచ్ను గెలవగలిగే కాంబినేషన్తో తుదిజట్టు ఉంటుంది'' అని గంభీర్ పేర్కొన్నాడు.