నాలుగో స్థానంలో..
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో- అజింక్య రహానె జట్టు కేప్టెన్ హోదాలో విలేకరులతో మాట్లాడాడు. శ్రేయాస్ అయ్యర్ను తుది జట్టులోకి తీసుకోబోతోన్నామని విషయాన్ని ధృవీకరించారు. కీలకమైన నాలుగో స్థానంలో శ్రేయాస్ ఆడతాడని పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి ప్లేస్ మారొచ్చనీ చెప్పుకొచ్చాడు. కాన్పూర్ టెస్ట్కు ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం అయ్యడనీ తెలిపాడు. గాయం వల్ల అతను తొలి టెస్ట్లో ఆడట్లేదని చెప్పాడు.
ఓపెనింగ్ కాంబినేషన్ ఓకే..
కేఎల్ రాహుల్ జట్టులో లేకపోవడం- ఇన్నింగ్ ఓపెనింగ్ మీద ఎలాంటి ప్రభావాన్నీ చూపదని అజింక్య చెప్పాడు. ఓపెనింగ్ కాంబినేషన్ను సిద్ధం చేసుకున్నామని వ్యాఖ్యానించాడు. కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను తుదిజట్టులో చోటు కల్పించనున్నామని అన్నాడు. ఈ సిరీస్కు రాహుల్ అందుబాటులో లేకపోవడం కొంత ఆందోళన కలిగించేదేనని, ఇంగ్లాండ్లో అతను అద్భుతంగా రాణించాడని చెప్పాడు. అతను లేకపోవడం వల్ల ఓపెనింగ్ కాంబినేషన్ మీద ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు.
ఆ ముగ్గురూ లేకపోవడం..
అపారమైన టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ కూడా ఈ రెండు టెస్టుల సిరీస్కు ఆడట్లేదని, వారు లేకపోవడం వల్ల యంగ్ క్రికెటర్లకు అవకాశం లభించినట్టయిందని అజింక్య వ్యాఖ్యానించాడు. యంగ్స్టర్స్కు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించినట్టయిందని అన్నాడు. తన ఫామ్ పట్ల తనకు పెద్దగా ఆందోళన లేదని, జట్టును ఎలా విజయ తీరాలకు చేర్చాలనే విషయం మీదే దృష్టి పెట్టానని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు రహానె.
స్పిన్కు అనుకూలంగా ఉండే పిచ్..
బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ బ్యాటర్గానే ఆలోచిస్తానని, కేప్టెన్గా బాధ్యతలను స్వీకరించినప్పుడు జట్టు ప్రయోజనాలు, సమష్టిగా రాణించడంపై దృష్టి పెడతానని అన్నాడు. స్పిన్కు అనుకూలంగా ఉండే పిచ్పై మ్యాచ్ ఆడబోతున్నామని, దీనికి అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని రహానే స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనడం కఠిన సవాల్ అని చెప్పాడు. గేమ్ ప్లాన్ అనేది గ్రౌండ్లో పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటదని రహానె అన్నాడు.
టీ20 స్పెషలిస్టులు టెస్టుల్లో..
కాగా- టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు టెస్ట్ జట్టులో ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. శుభ్మన్ గిల్ ఓపెనర్గా ఆడనున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి సిద్ధపడుతున్నాడు. టీ20 స్పెషలిస్టులుగా పేరున్న ఈ బ్యాటర్లు టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమౌతోంది. టెస్టులు కూడా ధనాధన్ ఫార్మట్గా మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.