బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తిరిగి పోటీలోకి రావడానికి శ్రమిస్తోంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్గా ఇది మూడో అత్యల్ప స్కోరు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్క్ (4/22) ధాటికి రిషభ్ పంత్ (20), యశస్వీ జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన న్యూజిలాండ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి రెండో రోజు 134 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఓవర్నైట్ స్కోరు 180/3తో ఇవాళ ఆట ఆరంభించిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు తెలివిగా బోల్తాకొట్టిస్తున్నారు. శుక్రవారం ఆట ప్రారంభమైన కాసేపటికే సిరాజ్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. డారిల్ మిచెల్ (18)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు.

ఆ తర్వాత టామ్ బ్లండెన్ (5)ను బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. అనంతరం బంతిని అందుకున్న రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిఫ్స్ (14)ను జడేజా ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్కే హైలైట్. జడేజా మిడిల్ స్టంప్కు గురి పెట్టి వేసిన బంతి ఫిలిప్స్ బలమైన డిఫెన్స్ను ఛేదించుకుని దూసుకెళ్లింది. ఆ తర్వాతి ఓవర్లో మ్యాట్ హెన్రీ (8)ని జడ్డూ బోల్తాకొట్టించాడు. వరుసగా రెండు బౌండరీలు బాది జోరు మీదున్న అతన్ని కూడా జడేజా బౌల్డ్ చేశాడు.
దాంతో న్యూజిలాండ్ 233 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోయింది. తిరిగి భారత్ పోటీలోకి వచ్చింది. కానీ టిమ్ సౌథ్ (34 నాటౌట్)తో కలిసి రచిన్ రవీంద్ర (103 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సౌథీతో అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు. 330/7. భారత్ కంటే 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.