
జైపూర్: టీ20 ప్రపంచకప్ 2021లో పేలవ ప్రదర్శనతో సూపర్ 12 దశ నుంచే ఇంటిదారిపట్టిన టీమిండియా.. అతి త్వరలో భారత్ చేరుకోనుంది. ఆ వెంటనే సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 17 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. కివీస్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 16 సభ్యుల జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది. యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకోనున్నాడు.
మూడు టీ20 మ్యాచ్లలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 17న జైపుర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కనీసం కరోనా టీకా తొలి డోసు తీసుకున్నవారినే జైపూర్ మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రికెట్ నిర్వహణ కమిటీ తెలిపింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపుర్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్టు ధర రూ. 1000 నుంచి రూ. 15,000 వరకు ఉండనుంది.
'భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 వేదికైన జైపూర్ మైదానంలోకి అభిమానులను అనుమతించే విషయంపై రాష్ట్ర హోంశాఖతో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల దృష్ట్యా.. కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నవారినే మైదానంలోకి అనుమతించనున్నాం. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మాస్కులు, శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశాం' అని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్ (నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ (నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్కతా (నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. ఆపై ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది. యూఏఈ నుంచి త్వరలో భారత్ చేరుకోనున్న టీమిండియా.. టీ20 సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. ఇప్పటికే కివీస్ టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ చేరుకున్న నేపథ్యంలో నవంబర్ 14 అనంతరం నేరుగా భారత్ రానుంది.