
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12లో భాగంగా భారత్ ఇవ్వాళ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్ను ఢీ కొట్టనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇవ్వాళ ఒకే రోజు మూడు మ్యాచ్లు ఉన్నందున రోజువారీ షెడ్యూల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా 1:30కు మొదలు కావాల్సిన మ్యాచ్ను ముందుకు జరిపారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు పోరు ఆరంభమౌతుంది.
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ను వర్షం వెంటాడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తొలి రోజు నుంచీ దెబ్బకొడుతూనే వస్తోంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోరు ఫలితం తేలలేదు. డక్వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఐర్లాండ్ చేతిలో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇలా ప్రతి రోజూ టీ20 ప్రపంచకప్కు వర్షం ఆటంకం కలిగిస్తూనే వస్తోంది.
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్కు వర్షం అడ్డు పడటానికి అవకాశాలు చాలావరకు లేవని, వాతావరణం అనుకూలంగా ఉందని మొదట భావించినప్పటికీ- ఆ తరువాత వర్షం ఆరంభమైంది. సిడ్నీ వ్యాప్తంగా ఆగి, ఆగి వర్షం కురుస్తోంది. ఇంకో మూడు గంటల్లో మ్యాచ్ మొదలు కావాల్సి ఉన్న నేపథ్యంలో దట్టంగా మేఘాలు అలముకోవడం, చిరుజల్లులు పడుతోండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే సిడ్నీలో దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్కు కూడా వర్షం కొంతసేపు ఆటంకం కలిగించింది.
మ్యాచ్ ఆరంభానికి ముందు తేలికపాటి జల్లులు పడ్డాయి. మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి తగ్గింది. మ్యాచ్ యధాతథంగా ఆరంభమైంది. బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా 10 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. కేప్టెన్ కమ్ ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్-37, రిలీ రొస్సొ-50 పరుగులు చేశారు. రొస్సొ- బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతుండటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.