మరో రణరంగం - రోహిత్ సేన సర్వం సిద్ధం: పొంచివున్న ఆ ముప్పు తప్పినట్టే..!!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12లో భాగంగా భారత్ ఇవ్వాళ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్ను ఢీ కొట్టనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇవ్వాళ ఒకే రోజు మూడు మ్యాచ్లు ఉన్నందున రోజువారీ షెడ్యూల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా 1:30కు మొదలు కావాల్సిన మ్యాచ్ను ముందుకు జరిపారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు పోరు ఆరంభమౌతుంది.

తొలి మ్యాచ్ ఇలా..
ఈ నెల 23వ తేదీన జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా ముగిసిన ఉత్కంఠభరిత పోరులో చిట్టచివరి బంతికి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేశాడు. బలమైన బౌలింగ్ వనరులు ఉన్న పాకిస్తాన్నే చిత్తు చేసిన నేపథ్యంలో- ఇవ్వాళ నెదర్లాండ్స్పై టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.

వర్షం బెడద..
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ను వర్షం వెంటాడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తొలి రోజు నుంచీ దెబ్బకొడుతూనే వస్తోంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోరు ఫలితం తేలలేదు. డక్వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఐర్లాండ్ చేతిలో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇలా ప్రతి రోజూ టీ20 ప్రపంచకప్కు వర్షం ఆటంకం కలిగిస్తూనే వస్తోంది.

వాతావరణం అనుకూలం..
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్కు వర్షం అడ్డు పడటానికి అవకాశాలు చాలావరకు లేవు. వాతావరణం అనుకూలంగా ఉంటోంది. పూర్తి మ్యాచ్ జరగడానికే ఛాన్సులు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ- వర్షం పడే సూచనలు లేవని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం బ్యూరో ఆఫ్ మెటెరాలజీ పేర్కొంది. మ్యాచ్ ప్రారంభంలో 21 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. క్రమంగా అది 17 డిగ్రీల వరకు క్షీణిస్తుందని అంచనా వేసింది. 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని, తేమ 60 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

ఛేజింగ్కు అనుకూలం..
ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ పిచ్ ఛేజింగ్కు అనుకూలంగా ఉంటుంది. టీమిండియా, నెదర్లాండ్స్ కేప్టెన్లు రోహిత్ శర్మ, స్కాట్ ఎడ్వర్డ్స్లల్లో ఎవరు టాస్ గెలిచినా- తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతారనడంలో సందేహాలు అక్కర్లేదు. పిచ్ పరిస్థితులు సెకెండ్ ఇన్నింగ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. తేమ శాతం పెరగడం వల్ల బంతులపై బౌలర్లు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ, పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. సిడ్నీ పిచ్పై ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 164 పరుగులు.

తుదిజట్టులో
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్.. ఆడే అవకాశం ఉంది. నెదర్లాండ్స్లో మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, బాస్ డి లీడే, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కేప్టెన్, వికెట్ కీపర్), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ ఆడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications