రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. సూపర్ ఫాస్ట్ సెంచరీతో చెలరేగి ఆడింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన భారత తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. 70 బంతుల్లో 100 పరుగులు చేసి, అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత మహిళా క్రికెటర్ గా రికార్డుకెక్కింది. ఐర్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనతను సాధించింది.
అంతేకాకుండా ఇదే మ్యాచ్ లో తన ధనాధన్ ఇన్నింగ్ తో మరిన్ని అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్గా, మొత్తంగా నాలుగో ప్లేయర్గా ఘనత సాధించింది. వన్డే ఫార్మాట్ లో మిథాలీ రాజ్ తర్వాత.. 500+ బౌండరీలు బాదిన రెండో భారత మహిళా బ్యాటర్గా నిలిచింది. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు(52) బాదిన ప్లేయర్ గానూ హర్మన్ ప్రీత్ కౌర్ తో సమంగా నిలిచింది. ఓవరాల్ గా అత్యధిక సిక్స్ ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియాండ్ర డాటిన్ 89 సిక్స లతో అగ్రస్థానంలో ఉంది.

కెప్టెన్గా, బ్యాటర్గా ..
ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ దూరమైంది. దీంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు స్వీకరించింది. ఈ క్రమంలోనే కెప్టెన్గానూ, బ్యాటర్గానూ స్మృతి అదిరే ప్రదర్శన చూపుతోంది.
ఇప్పటికే ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా.. సిరీస్ను 2-0తో దక్కించుకుంది. ఈ రెండు మ్యాచ్లలో స్మృతి మంధాన వరుసగా 41, 73 పరుగులు చేసింది. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా జరుగుతోన్న మూడో వన్డేలోనూ స్మృతి తన ఫామ్ను కొనసాగించింది. 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. ఉమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచింది. మొత్తంగా ఈ మ్యాచ్లో 80 బంతులు ఎదుర్కొన్న స్మృతి.. 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఇక ఐర్లాండ్ బౌలర్ ఓర్లా ప్రెండెర్గాస్ట్ బౌలింగ్లో అవా కానింగ్కు క్యాచ్ ఇచ్చి స్మృతి ఔట్ అయింది.
ఇక ఇదే మ్యాచ్ లో మరో ఓపెనర్ ప్రతికా రావల్ కూడా సెంచరీతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొన్న ఆమె 154 పరుగులు సాధించింది. ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ బాదింది.
వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత మహిళా ప్లేయర్లు
1. స్మృతి మంధాన- ఐర్లాండ్పై- రాజ్కోట్(2025)- 70 బంతుల్లో సెంచరీ
2.హర్మన్ప్రీత్ కౌర్- సౌతాఫ్రికాపై- బెంగళూరు(2024)- 87 బంతుల్లో సెంచరీ
3. హర్మన్ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియాపై- డెర్బీ(2017)- 90 బంతుల్లో సెంచరీ
4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ పై - రాజ్కోట్(2025)- 90 బంతుల్లో సెంచరీ
5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్పై- వడోదర(2024)- 98 బంతుల్లో సంచరీ
వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన మహిళా క్రికెటర్లు
మెగ్ లానింగ్- 15, సుజీ బేట్స్- 13, టామీ బీమౌంట్- 10, స్మృతి మంధాన- 10, చమరి ఆటపట్టు- 9,
చార్లెట్ ఎడ్వర్డ్స్- 9, నాట్ సీవర్ బ్రంట్- 9.