టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్కు అదిరే ఆరంభం దక్కింది. న్యూయార్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్షదీప్ సింగ్ (2/35) సత్తాచాటారు.
అనంతరం భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (36 నాటౌట్, 26 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్యాటింగ్కు అనుకూలించని పిచ్పై హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. సారథిగా, హిట్టర్గా చరిత్ర సృష్టించాడు.

రోహిత్ సాధించిన రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్గా రోహిత్ చరిత్రకెక్కాడు. టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టీ20ల్లో 193 సిక్సర్లతో ప్రత్యర్థిపై హిట్ మ్యాన్ విరుచుకుపడ్డాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 4వేల పరుగుల మార్క్ను అందుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (4038) తర్వాత రోహిత్ (4026), బాబర్ అజామ్ (4023) ఉన్నారు.
టీ20ల్లో నాలుగు వేల పరుగులను వేగంగా అందుకున్న ఆటగాడిగా హిట్మ్యాన్ ఘనత సాధించాడు. 2860 బంతుల్లో ఈ మార్క్ను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి (2900 బంతుల్లో) పేరిట ఉండేది. బాబర్ 3079 బంతుల్లో నాలుగు వేల రన్స్ సాధించాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్లో అర్ధశతకం సాధించిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక ఐర్లాండ్పై నెగ్గిన రోహిత్కు కెప్టెన్గా ఇది 43వ విజయం. ఈ గెలుపుతో భారత్ తరఫున అత్యధిక టీ20ల్లో విజయాలు అందుకున్న ఎంఎస్ ధోనీ (43)తో సమంగా నిలిచాడు. ధోనీ-రోహిత్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి (32) ఉన్నాడు.