ముంబై: భారత క్రికెట్ జట్టు ఆడబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల జాతర ఇప్పటికే మొదలైంది. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ అనంతరం ఇక విదేశీ పర్యటనల్లో బిజీగా గడపబోతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే.. ఇలా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ వరకూ తీరిక లేని షెడ్యూల్ను ఎదుర్కొనబోతోంది. మూడు నుంచి నాలుగు నెలల పాటు టీమిండియా ప్లేయర్లు అంతర్జాతీయ పర్యటనల్లో తలమునకలు కానున్నారు.
విదేశీ పర్యటనల్లో భాగంగా తొలి సిరీస్.. ఐర్లాండ్తో ఆరంభం కానుంది. దీని తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకల్లో పర్యటిస్తుంది. ఐర్లాండ్తో రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లను ఆడనుంది భారత క్రికెట్ జట్టు. ఈ నెల 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఈ రెండూ షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 9 గంటలకు మ్యాచ్లు ఆరంభమౌతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.
Here we go 🇮🇳✈️ #Ireland pic.twitter.com/zPkBTMtgpa
— Yuzvendra Chahal (@yuzi_chahal) June 22, 2022
ఐర్లాండ్తో ఈ రెండు టీ20 మ్యాచ్ల కోసం భారత జట్టుకు ఇదివరకే జట్టును ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్గా అపాయింట్ అయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కేప్టెన్. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ సెలెక్ట్ అయ్యారు. ఈ సిరీస్కు హెడ్ కోచ్.. వీవీఎస్ లక్ష్మణ్.
ఈ సిరీస్ కోసం యంగ్ టీమిండియా డబ్లిన్ విమానం ఎక్కింది. విమానాశ్రయంలో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి దిగిన ఓ ఫొటోను యజువేంద్ర చాహల్ తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సిరీస్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సోనీ లివ్ యాప్లో ఈ రెండు మ్యాచ్లను చూడొచ్చు. మ్యాచ్లన్నీ రాత్రి 9 గంటలకు ప్రారంభమౌతాయి. అర్ధరాత్రి 12:30 గంటల వరకు మ్యాచ్ కొనసాగొచ్చు.
ఐర్లాండ్ టీమ్కు ఆండ్రూ బల్బిర్నే కేప్టెన్. ఈ జట్టులో హ్యారీ ట్రాక్టర్, జార్జ్ డాక్రెల్, గెరెత్ డెలానీ, పాల్ స్టిర్లింగ్, కర్టిస్ క్యాంఫర్, స్టీఫెన్ డొహెనీ, లొర్కాన్ టక్కర్, మార్క్ అడైర్, కానర్ ఆల్ఫర్ట్, జోషువా లిటిల్, ఆండీ మెక్బ్రైన్, బ్యారీ మెక్కార్థీ, క్రెయిగ్ యంగ్ ఎంపికయ్యారు.