రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయిదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. 192 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 61 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (55; 81 బంతుల్లో) శుభ్మన్ గిల్ (52*; 124 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు. ధ్రువ్ జురెల్ (39*; 77 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తొలి ఇన్నింగ్స్ 90 పరుగులతో పాటు ఛేదనలో సత్తాచాటిన ధ్రువ్ జురెల్ను రోహిత్ కొనియాడాడు. ''ఇది చాలా కష్టతరమైన సిరీస్. నాలుగు మ్యాచ్ల్లోనే సిరీస్ గెలవడం చాలా బాగుంది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతిఒక్కరి పట్ల గర్వపడుతున్నా. మేం భిన్న టెస్టుల్లో విభిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రశాంతతో ఉంటూ వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నాం''

''ఇక జట్టులో తమ స్థానాలు నిలదొక్కుకోవాలని కుర్రాళ్లు ఎంతో పట్టుదలతో ఉన్నారు. దేశవాళీ క్రికెట్, లోకల్ క్లబ్ క్రికెట్లో సత్తాచాటి, క్లిష్టమైన సవాళ్లను దాటి వాళ్లు ఇక్కడకు చేరుకున్నారు. వాళ్ల నుంచి మంచి ప్రదర్శన రావడం సంతోషంగా ఉంది. మంచి వాతావరణాన్ని కల్పించడమే మా కర్తవ్యం. వాళ్ల బాధ్యతలను ఏంటో వాళ్లకి స్పష్టంగా తెలుసు. దాని గురించి ఎక్కువసార్లు గుర్తుచేయడం, ఆలోచించడం ఉండవు''
''ఇక తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ గొప్పగా రాణించాడు. ప్రశాంతతో బ్యాటింగ్ చేశాడు. వికెట్కు అన్ని వైపులుగా పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో అతడు సాధించిన 90 పరుగులు ఎంతో కీలకం. అతడి వల్ల తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు స్కోరుకు చేరువయ్యా. అంతేగాక గిల్తో కలిసి అతడు పరిణితితో ప్రశాంతంగా ఉంటూ సత్తాచాటాడు'' అని రోహిత్ అన్నాడు.
విరాట్ కోహ్లి, పంత్ వంటి ఆటగాళ్ల స్థానాల భర్తీ గురించి మాట్లాడుతూ.. ''ప్రతి కండిషన్లో సత్తాచాటగలమని సీనియర్లు నిరూపించుకున్నారు. వాళ్ల స్థానాల్లో కుర్రాళ్లు అదరగొట్టడం అంత తేలికకాదు. వాళ్లపై బయట నుంచి ఒత్తిడి ఉంటుంది. యాజమాన్యం నుంచి మాత్రం ఎలాంటి ప్రెజర్ ఉండదు. అయితే అంచనాలకు దీటుగా కుర్రాళ్లు బదులిస్తున్నారు. వాళ్లకు మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నా. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఆఖరి టెస్టులోనూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ - 353
భారత్ తొలి ఇన్నింగ్స్ - 307
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ - 145
భారత్ రెండో ఇన్నింగ్స్ - 192/5