టీమిండియా అదరగొట్టింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుని 1-1తో సిరీస్ను రోహిత్ సేన సమం చేసింది. బుమ్రా బుల్లెట్ బంతులు, తొలి ఇన్నింగ్స్లో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ మ్యాచ్లో హైలైట్గా నిలిచాయి.
కాగా, మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. బుమ్రా ఛాంపియన్ బౌలర్ అని, సమష్టిగా విజయం సాధించామని తెలిపాడు.''మాకు బుమ్రా ఛాంపియన్ ప్లేయర్. గతంలో ఇలాంటి గొప్ప ప్రదర్శనలు అతను చేశాడు. అయితే విజయం సాధించాలంటే ఓవరాల్గా సత్తాచాటాలి. మేం బ్యాటింగ్లో రాణించాం. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టును గెలవడం అంత సులువు కాదు. మా బౌలర్లు అదరగొట్టాలని ఆశించాం. వారు చేసి చూపించారు'' అని రోహిత్ అన్నాడు.

యశస్వీ జైస్వాల్ గురించి హిట్మ్యాన్ మాట్లాడుతూ..''జైస్వాల్ మంచి ఆటగాడు. గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడు. అతడికి మంచి భవిష్యత్ ఉంది. జట్టు తరఫున వచ్చే మరిన్ని అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నా. వైజాగ్ వికెట్ బ్యాటింగ్ చేయాడానికి అనుకూలంగా ఉంది. కానీ మేం ఓ విషయం గురించి దృష్టి సారించాలి. మా బ్యాటర్లు ఎంతోమంది మంచి ఆరంభాన్ని పొంది కూడా భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. దీనిపై ఆలోచించాలి''
''అయితే మా జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్లకు అనుభవం తక్కువగా ఉంది. కాస్త సమయం, భరోసా ఇవ్వడం ఎంతో ముఖ్యం. అయితే ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుపై వాళ్లు సత్తాచాటం గర్వించదగ్గ విషయం. వాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నా. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే గత కొన్నేళ్లుగా ఆ జట్టు గొప్పగా ఆడుతోంది. ఈ సిరీస్ అంత తేలికగా ఉండదు. ఇంకా మరో మూడు టెస్టులు ఉన్నాయి. మా జట్టు మరింత మెరుగ్గా ఆడేలా సన్నద్ధమవుతాం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
స్కోరు వివరాలు
టీమిండియా తొలి ఇన్నింగ్స్- 396 (యశస్వీ జైస్వాల్ 209; అండర్సన్ 3/47)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 253 (క్రాలే 76; బుమ్రా 6/45)
టీమిండియా రెండో ఇన్నింగ్స్- 255 (గిల్ 104; టామ్ హర్ట్లీ 4/77)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్- 292 (క్రాలే 73; బుమ్రా 3/46)