రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్పై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 353 పరుగుల భారీ స్కోరు సాధించిన ఇంగ్లండ్.. బంతితోనూ సత్తాచాటుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్పిన్ ధాటికి రెండో రోజు ఆట రెండో సెషన్ ముగిసేసరికే టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
38 ఓవర్లకు భారత్ స్కోరు 131/4. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్ (54*; 96 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (1; 7 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (2; 9 బంతుల్లో), శుభ్మన్ గిల్ (38; 65 బంతుల్లో), రజత్ పటిదార్ (17; 42 బంతుల్లో), రవీంద్ర జడేజా (12; 12 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్గా 'ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా' యాషెస్ సిరీస్తో సమంగా నిలిచింది. 2023లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆసీస్ జట్లు కలిపి 74 సిక్సర్లు సాధించాయి. ఇప్పుడు అదే రికార్డును ప్రస్తుత టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమం చేసింది.
అయితే 74 సిక్సర్లలో యశస్వీ జైస్వాల్దు సింహభాగం. అతడు ఒక్కడే 23 సిక్స్లు బాదడం విశేషం. జైస్వాల్ తర్వాత రెండో స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా కేవలం ఆరు సిక్సర్లే సాధించాడు. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు జాక్ క్రాలే (5), టామ్ హర్ట్లీ ఉన్నారు. రాంచీ టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్ సిక్సర్ల రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయమే.
టెస్టు చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్లు
74 సిక్సర్లు - భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2024)
74 సిక్సర్లు - ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (2023)
65 సిక్సర్లు - ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (2013/14)
65 సిక్సర్లు - భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2019)
59 సిక్సర్లు - పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (2014).