టీమిండియా యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య సాగుతున్న టెస్టు సిరీస్లో లీడింగ్ స్కోరర్గా జైస్వాల్ నిలిచాడు. నాలుగు టెస్టుల్లో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో పరుగుల పరంగా అతని తర్వాతి స్థానంలో నిలిచిన శుభ్మన్ గిల్ చేసిన రన్స్ 342 మాత్రమే. వీరిద్దరి మధ్య ఉన్న 313 పరుగులు భేదాన్ని చూస్తేనే అర్థమై ఉంటుంది.. 22 ఏళ్ల జైస్వాల్ ఏ రీతిలో చెలరేగుతున్నాడో!
అయితే ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన యశస్వీ జైస్వాల్ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఈ సారి ప్రత్యర్థి జట్టులో ఉన్న కెప్టెన్, కోచ్ ఘనతలపై జైస్వాల్ గురిపెట్టాడు. ఓ క్యాలెండర్ ఏడాది టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కడానికి జైస్వాల్కు మరో 10 సిక్సర్ల అవసరం. ఈ జాబితాలో ఇంగ్లండ్ ప్రస్తుత ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014 సంవత్సరంలో మెక్కలమ్ టెస్టుల్లో 33 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో ఉన్న బెన్ స్టోక్స్ 2022లో 26 సిక్సర్లు సాధించాడు.

ప్రస్తుత టెస్టు సిరీస్లో జైస్వాల్ 63 ఫోర్లు, 23 సిక్సర్లు బాదాడు. కాగా, ఈ అరుదైన రికార్డును ధర్మశాల టెస్టులో జైస్వాల్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆఖరి టెస్టులో ఆ రికార్డును అందుకోలేకపోయినా జైస్వాల్ 2024లో కచ్చితంగా బ్రేక్ చేస్తాడు. ఈ ఏడాదిలో భారత్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. జైస్వాల్ ఫామ్ను చూస్తే ఈ రికార్డు బద్దలవ్వడం సులభమే.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రతి మ్యాచ్లో కనీసం 50కు పైగా పరుగులు సాధించిన జైస్వాల్ మరికొన్ని రికార్డులపై కన్నేశాడు. ఆఖరి టెస్టులో జైస్వాల్ మరో 45 పరుగులు చేస్తే భారత్-ఇంగ్లండ్ ఓ టెస్టు సిరీస్లో 700 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కనున్నాడు. మరో 98 పరుగులు చేస్తే ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవనున్నాడు.
అలాగే మరో 119 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా నిలవనున్నాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ గవాస్కర్ 774, 732 పరుగులతో తొలి రెండు స్థానాల్లో, విరాట్ కోహ్లీ 692, 655 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాడు. కాగా, ఇంగ్లండ్తో అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.